Danam : ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్కు వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్.. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరి సికింద్రాబాద్ నుంచి ఎంపీగా బరిలో నిలిచారని, ఆయనపై స్పీకర్ అనర్హత వేటు వేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ రాజు యాదవ్ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు.
ఒక పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఉండి, రాజీనామా చేయకుండా మరో పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేయడం చట్ట విరుద్ధం, రాజ్యాంగ విరుద్ధమని యాదవ్ తన పిటిషన్లో పేర్కొన్నారు. కాబట్టి దానంపై అనర్హత వేటు వేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. కాగా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్ బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆయనను సికింద్రాబాద్ నుంచి ఎంపీగా బరిలో దించింది.