Anganwadi Eggs | కులకచర్ల, జనవరి 21: చిన్నపిల్లలు, గర్భిణులు, బాలింతలకు ప్రభుత్వం ద్వారా అందించాల్సిన కోడి గుడ్లను ఓ వ్యక్తి అంగట్లో అమ్మకానికి పెట్టాడు. స్థానికులు గుర్తించి అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన ఆదివారం వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండల కేంద్రంలో వెలుగుచూసింది. చౌడాపూర్ మండలం మందిపల్ గ్రామానికి చెందిన పెంటయ్య డీసీఎం డ్రైవర్గా పని చేస్తున్నాడు. ఆదివారం ఆయన చౌడాపూర్ మండల కేంద్రంలో రూ.5 చొప్పున కోడిగుడ్లను విక్రయిస్తున్నాడు. స్థానికులు కొందరు వీటిని అంగన్వాడీ కేంద్రాల్లో పంపిణీ చేసే గుడ్లుగా గుర్తించారు. వాటిపై తెలంగాణ ప్రభుత్వం అనే ముద్ర కూడా ఉన్నది. అప్పటికే అతని వద్ద ట్రేలలో 600లకు పైగా గుడ్లు ఉన్నాయి.
వెంటనే పంచాయతీ కార్యదర్శికి సమాచారం అందించగా ఆయన వెళ్లి గుడ్లను పరిశీలించి, తహసీల్దార్కు ఫిర్యాదు చేశారు. తహసీల్దార్ ప్రభులు గుడ్లను విక్రయిస్తున్న పెంటయ్యను పిలిపించి విచారణ జరుపగా.. అవి అంగన్వాడీ కేంద్రాలకు చెందిన గుడ్లేనని అంగీకరించాడు. మెదక్ జిల్లా తూప్రాన్లోని స్నేహితుడు వెంకటేశ్ దగ్గర నుంచి గుడ్లను తీసుకొచ్చి, కొంతకాలంగా విక్రయిస్తున్నట్టు చెప్పాడు. తహసీల్దార్ వాటిని స్వాధీనం చేసుకొన్నారు. సోమవారం గుడ్లను ఐసీడీఎస్ అధికారులకు అప్పగిస్తామని చెప్పారు. ఐసీడీఎస్ సూపర్వైజర్ అంజమ్మ ఫిర్యాదు మేరకు పెంటయ్యపై కేసు నమోదు చేసినట్టు కులకచర్ల ఎస్సై శ్రీశైలం ప్రభుత్వం అందిస్తున్న కోడి గుడ్లను బహిరంగ మార్కెట్లో విక్రయిస్తున్నా ఐసీడీఎస్ అధికారులు పట్టించుకోకపోవడంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.