కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దీర్ఘకాలికంగా నెలకొన్న పోడు భూముల సమస్య పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అందుకే క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసి పరిష్కరం దిశగా అడుగులు వేస్తోందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు.
ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం కొత్తగూడెం క్లబ్లో పోడు, అడవుల పరిరక్షణ పై జిల్లా కలెక్టర్ అనుదీప్, ఐటీడీఏ పీఓ గౌతమ్, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఎస్పీ సునీల్ దత్, అటవీ శాఖ అధికారులు సీసీఎఫ్ రాజారావు, వివిధ రాజకీయ పార్టీలతో అఖిలపక్ష సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..పోడు భూముల సమస్యకు శాశ్వతంగా పరిష్కారం కనుగొనే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుందని మంత్రి పువ్వాడ వెల్లడించారు. ఇప్పటికే మంత్రి సత్యవతి రాథోడ్ ఆధ్వర్యంలో పలు మార్లు ఏర్పాటైన మంత్రివర్గ ఉప సంఘం ముఖ్యమంత్రి కేసీఆర్కు నివేదిక అందించిందని ఆయన చెప్పారు.
అందులో బాగంగా లబ్ధిదారులను ఎంపిక చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టినట్లు ఆయన వివరించారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న పోడు భూముల సమస్యకు తెరదించే ప్రయత్నంలో భాగంగా సమావేశం నిర్వహించామన్నారు. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో అధికారులు పర్యటించి పోడు భూములను సాగు చేసుకుంటున్న వారి వివరాలు పకడ్బందీగా సేకరించాలని మంత్రి ఆదేశించారు. ఆ దిశగా అటవీ, రెవెన్యూ, గిరిజన సంక్షేమ శాఖలకు చెందిన అధికారులు సమన్వయంతో వ్యహరించాలన్నారు.
సమావేశంలో ప్రభుత్వ విప్ రేగా కాంతారావు గారు, ఎంపీ మలోత్ కవిత, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యేలు హరిప్రియ నాయక్, వనమా వెంకటేశ్వర రావు, మెచ్చా నాగేశ్వర రావు, రాములు నాయక్, కొత్తగూడెం మున్సిపల్ చైర్మన్ కాపు సీతామహాలక్ష్మి, అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు, అఖిలపక్ష నాయకులు షాబీర్ పాషా(సిపిఐ), దుర్గా ప్రసాద్(కాంగ్రెస్), మిడియం బాబూరావు (సిపిఎం), కోనేరు నాగేశ్వరరావు(బీజేపీ), గంధం మల్లికార్జున్(బీఎస్పీ), పునేం శ్రీను(టీఆర్ఎస్), వి.నారాయణ(టిడిపి) అధికారులు ఉన్నారు.