కోస్గి, డిసెంబర్ 23 : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహాలక్ష్మి పేరుతో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించింది. దీంతో బస్టాండ్లు, బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. కానీ సీఎం రేవంత్రెడ్డి సొంత ఇలాకాలో మాత్రం బస్సు కండక్టర్ల తీరుపై ఆగ్రహం వ్యక్తమవుతున్నది. మహబూబ్నగర్-తాండూర్ మధ్య తిరుగుతున్న ఆర్టీసీ బస్సులో కండక్టర్ చేతివాటం ప్రదర్శిస్తున్న దృశ్యాలను శనివారం ఓ ప్రయాణికుడు చిత్రీకరించారు.
మహబూబ్నగర్ నుంచి తాండూర్ వెళ్తున్న బస్సు (టీఎస్ 34 టీఏ 5189)లో ఉన్న కండక్టర్ సీటులో దర్జాగా కూర్చోని ప్రతి స్టేజీ వద్ద మహిళా ప్రయాణికులు బస్సు ఎక్కకపోయినా 10 నుంచి 20 టికెట్లు ఇష్యూ చేశాడు. గండీడ్, జానంపల్లి ఇలా రెండు స్టేజీల వద్ద బస్సులో మహిళా ప్రయాణికులు తక్కువగా ఉండటంతో టిమ్ నుంచి టికెట్లు మాత్రం ప్రింట్ ఇచ్చాడు. తర్వాత వాటిని చించి బయట పడేశాడు. బస్సులో సగం కంటే ఎక్కువ సీట్లు ఖాళీ ఉన్నా టికెట్లు మాత్రం జారీ చేస్తూ మహిళలు ప్రయాణిస్తున్నట్టు లెక్కలు చూపిస్తున్నట్టు తెలుస్తున్నది. కండక్టర్ తీరుపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.