సూర్యాపేట : జిల్లా పరిధిలోని రాయిని గూడెం సమీపంలోని మూసీవాగులో ఓ వృద్ధ మహిళ శుక్రవారం రాత్రి చిక్కుకుంది. గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా, కొల్లూరు గ్రామానికి చెందిన కట్టా రాములమ్మ కేతేపల్లి మండలం ఉప్పలపాడు గ్రామం నుంచి భిక్షాటన చేస్తూ మూసీవాగులోకి శుక్రవారం రాత్రి వెళ్లింది. భిక్షాటన చేసిన అన్నం అక్కడే తిని ఒక రాయిపై పడుకుంది.
ముాసీ వాగులో ఒక్కసారిగా నీటి ప్రవాహం పెరగడంతో ఎటూ వెళ్లలేక అక్కడే ఉండిపోయింది. తెల్లవారు జామున స్థానికులు చూసి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే సహాయక చర్యలు చేపట్టి ఆ వృద్ధ మహిళను ప్రాణాలతో రక్షించారు.