Pink Whatsapp | హైదరాబాద్, జూన్ 16 (నమస్తే తెలంగాణ): ‘వాట్సాప్కు కొత్త వెర్షన్ వచ్చేసింది. వెంటనే పింక్ వాట్సాప్కు అప్గ్రేడ్ అవ్వండి’ అంటూ మెసేజ్లు వస్తున్నాయా? అయితే, తస్మాత్ జాగ్రత్త. పింక్ వాట్సాప్ను ఇన్స్టాల్ చేశారో ఫోన్లోని డాటా మొత్తం సైబర్ నేరగాళ్లకు చేరిపోతుంది. ఆ తర్వాత వ్యక్తిగత సమాచారాన్ని అడ్డుపెట్టుకొని బ్లాక్మెయిల్ చేస్తూ, డబ్బులు డిమాండ్ చేస్తారు. పింక్ వాట్సాప్ పేరుతో సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేసేది ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే వారినే. పింక్ వాట్సాప్ కొత్త వెర్షన్ అని, ఇందులో బోలెడన్ని ఆప్షన్లు ఉన్నాయని ఊదరగొడతారు.
మనం మెసేజ్ చేస్తే పేరు కూడా కనిపించదని, బ్లూటిక్స్ అనే ఆప్షన్లు లేకుండా సెట్టింగ్స్ మార్చుకోవచ్చని, వాట్సాప్ కాల్స్ రికార్డు చేసుకోవచ్చని, నచ్చనివారి ఫొటోలను ఈజీ మార్ఫింగ్ చేసుకోవచ్చని ఇలా ఆప్షన్లను కండ్ల ముందు ఉంచుతారు. ఆ మాయ ప్రకటనలకు పడిపోతే అంతే. యాప్ను ఇన్స్టాల్ చేయగానే, ఇతర యాప్స్, ఫొటోలు, గ్యాలరీ, కెమెరా యాక్సెస్కు పర్మిషన్లు అడుగుతుంది. ఓకే అని క్లిక్ చేస్తే.. ఆ వాట్సాప్ పింక్ కలర్లో తప్ప ఇతర ఏ ఆప్షన్లు కనిపించవు. ఆ విషయం తెలిసేలోగానే ఫోన్లోని సమాచారం అంతా సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లిపోతుంది. కావాలనుకొంటే ప్రమాదకర వైరస్లు పంపి ఫోన్ను హ్యాక్ చేస్తారు. ఉత్తర భారతదేశంలో ఇలాంటి మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. అమాయకుల నుంచి రూ.లక్షలు దండుకొంటున్న సంఘటనలు జరుగుతున్నాయి.
పింక్ వాట్సాప్ అనేది పెద్ద మోసం. వెంటనే అన్ఇన్స్టాల్ చేసుకోండి. ముందుగా పింక్ వాట్సాప్ అప్లికేషన్ను సైబర్ నేరగాళ్లు స్కామర్లకు కొంత డబ్బుకు అమ్ముకుంటున్నారు. ఆ స్కామర్లు బల్క్ మెసేజ్లతో అమాయకులను టార్గెట్ చేస్తూ వారి సమాచారం తస్కరిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఒక్కోసారి డబ్బులు ముట్టిన వెంటనే సైబర్ నేరగాళ్లు స్కామర్లకు నకిలీ లింకులు పంపి సొమ్ము చేసుకుంటున్నారు. ఇదొక పెద్ద మాయ. ప్రజలెవరైనా ఇట్లాంటి సైబర్ నేరాలకు గురైతే వెంటనే 1930కి కాల్ చేయాలి. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలి.
– అనిల్ రాచమల్ల, సైబర్ నిపుణుడు, ఎండ్నౌ ఫౌండేషన్