BJP | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ): లోక్సభ ఎన్నికల వేళ ఏదో ఒక అంశాన్ని ముందరేసుకోవడం, దాన్ని పెద్దయెత్తున ప్రచారం చేసి ఓట్లు దండుకోవడం బీజేపీకి రివాజుగా మారింది. 2014లో నల్లధనం అంశం, 2019లో పుల్వామా ఘటనల ద్వారా లబ్ధి పొందిన కమలదళం ఇప్పుడు మళ్లీ అదే పంథాను అనుసరిస్తున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయోధ్య రామమందిర నిర్మాణం తమకు ఓట్లు తెచ్చిపెడుతుందని మొన్నటివరకూ కమలనాథులు అనుకొన్నారు. అయితే, ఆ విషయాన్ని ప్రజలు క్రమంగా మరిచిపోవడంతో బీజేపీ పరివారం ఇప్పుడు ఉగ్రవాదుల ఏరివేత అనే మరో కొత్త అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చినట్టు పలువురు అభిప్రాయపడుతున్నారు.
‘దేశంలో శాంతికి భంగం కలిగిస్తే, మేము పాకిస్థాన్లోకి ప్రవేశించి మరీ ఉగ్రమూకలను మట్టుబెడతాం’ అంటూ రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ గతవారం తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అయితే, ఉన్నట్టుండి ఆయన ఆ స్థాయిలో విరుచుకుపడటానికి కారణమేమిటా? అని పలువురికి సందేహాలు కలిగాయి. అంతే.. అటు రాజ్నాథ్ ప్రకటన వెలువడిందో లేదో.. ఇటు సోషల్ మీడియాలో అనామక ఖాతాల నుంచి పోస్టుల వెల్లువ మొదలైంది. గడిచిన మూడు, నాలుగు నెలల వ్యవధిలో హతమైన ఉగ్రవాదులను మట్టుబెట్టింది మోదీ సర్కారేనని, సీక్రెట్ ఆపరేషన్స్తో ఎంతో చాకచక్యంగా ఈ పనులను పూర్తిచేశారని ఆ పోస్టుల్లో ఊదరగొట్టారు.
పార్లమెంట్పై దాడి, ముంబై పేలుళ్లు, పుల్వామా ఘటనల సూత్రధారి జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ చీఫ్ మసూద్ అజహర్ హతమైనట్టు గత జనవరిలో వార్తలు వెలువడ్డాయి. అయితే, ఆయన మరణాన్ని ఇప్పటివరకూ ఎవరూ ధ్రువీకరించలేదు. అండర్వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం మరణించినట్టు కూడా పుకార్లు వచ్చాయి. అయితే ఇది తప్పని అగ్రరాజ్యాలు కొట్టిపారేశాయి. ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్పై హత్యాయత్నం ఓ మిస్టరీగా ఉండిపోయింది. తాజాగా సరబ్జిత్ సింగ్ హంతకుడు, ఉగ్రవాది అమీర్ సర్ఫరాజ్ తంబా హతమైనట్టు వార్తలు గుప్పుమన్నాయి. కానీ, తంబా మరణించలేదని పాకిస్తాన్ పోలీసు అధికారి ఒకరు పేర్కొన్నారు. పైన పేర్కొన్న ఏ ఒక్క ఉదంతంలోనూ నిజమేంటో? అబద్దమేంటో? ఇప్పటివరకూ అధికారికంగా తెలియదు. ఈ ఉగ్రవాదులు హతమయ్యారో? లేదో? కూడా నిర్ధారణ కాలేదు. ఆయా దేశాలు కూడా వీటిపై నోరు మెదపట్లేదు. అయినప్పటికీ, ఇవన్నీ తమ ఘనతగానే కొందరు బీజేపీ సానుభూతిపరులు సోషల్ మీడియాలో పోస్టుల రూపంలో అసత్య ప్రచారాన్ని చేస్తున్నారు. ఆ ప్రచారానికి తగినట్టు సాక్ష్యాలూ, ఆధారాలను చూయిస్తున్నారా? అంటే అదీ లేదు. దీంతో ఎన్నికల్లో ఓట్లు దండుకోవడానికే బీజేపీకి చెందిన కొందరు ఇలాంటి మైండ్ గేమ్స్కు దిగుతున్నట్టు రాజకీయ విశ్లేషకులు, బుద్ధిజీవులు అభిప్రాయపడుతున్నారు.