హైదరాబాద్, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ): డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలగాణ సచివాలయాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టారని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి కొనియాడారు. నూతన సచివాలయ ప్రాంగణంలో ఆదివారం సాయంత్రం నిర్వహించిన బాణసంచా సంబురాలను మంత్రి వేముల ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డాక్టర్ బీఆర్ అంబేదర్ సచివాలయాన్ని సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించుకోవడంతో రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొన్నదని హర్షం వ్యక్తం చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టు, 125 అడుగుల అంబేదర్ విగ్రహం, నూతన సచివాలయం.. ఇలా ఏది చేసినా సీఎం కేసీఆర్తోనే సాధ్యమని పేర్కొన్నారు. సచివాలయ ప్రారంభ సభను 3 వేల మందితో మాత్రమే నిర్వహించాలని తొలుత అనుకున్నప్పటికీ అంచనాలకు మించి దాదాపు 10 వేల మంది హాజరయ్యారని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, ఉద్యోగులకు పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు.