Telangana | కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులకు కరెంట్ కష్టాలు తప్పవు.. మళ్లీ కరెంట్ షాకులతో, పాములు కరిచి చనిపోయే పరిస్థితులు వచ్చే ప్రమాదం ఉందని ఓ రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. నాడు కరెంట్ కోసం పోయి దొంగలతో దెబ్బలు తిని, 14 ఏండ్ల నుంచి మంచాన పడ్డాను.. ఇప్పటికీ లేవలేక ఉన్నాను అని ఓ రైతు బోరున విలపించాడు. కరెంట్ కష్టాలు రావొద్దంటే, 24 గంటల కరెంట్ కావాలంటే కేసీఆర్నే మళ్లీ గెలిపించుకోవాలని రైతు లోకానికి పిలుపునిచ్చాడయన.
మాది కొత్తపేట(నల్లగొండ).. నా పేరు లింగ. 14 సంవత్సరాల కిందట బాయికాడ మోటారు పెట్టొద్దమని పోయిన. కరెంట్ లేదు. ఇంటికి వద్దామని అనుకునే లోపే ఇద్దరు దొంగలు వచ్చి కొట్టారు. ఏమైందంటే.. కరెంట్ మంచిగా ఉంటలేదు. పొద్దున్నాదాకా 4 గంటలు, రాత్రి పూట 3 గంటల కరెంట్ ఇచ్చేటోళ్లు. ఏ టైంలో వస్తుందో ఎప్పుడు పోతదో అని పోయిన. ఆ రోజు కరెంట్ లేదు. ఇక ఇంటికి వద్దామని వస్తుంటే దొంగలు ఉన్నవన్నీ ఊడగుంజుకుపోదామని కొట్టారు. బొక్కలు ఇరగ్గొట్టారు. అప్పట్నుంచి ఇప్పటి దాకా ఇదే పరిస్థితి. 14ఏండ్ల నుంచి మంచాన పడ్డాను. గోసపడుతున్నా. ఎన్ని మందులు వాడిన తగ్గట్లేదు.
కేసీఆర్ ప్రభుత్వంలో కరెంట్ మంచిగ వస్తుంది. రైతులు హాయిగా పండుకుంటున్నారు ఇండ్లలో. పొలాలు మంచిగా పారుతున్నాయి. అప్పుడేమో కాపలా ఉండేటోళ్లు. ఇప్పుడు నీళ్లు పుష్కలంగా ఉన్నాయి. కరెంట్ కష్టాల కారణంగా దెబ్బలు తిన్నోళ్లు, పాములు కరిచి సచ్చినోల్లు ఉన్నారు. ఇప్పుడున్న కరెంట్ అప్పుడు ఉంటే ఆ కాపలా పోకుండా స్విచ్ వేస్తే అదే పారుతుండే. నన్ను దొంగలు కొట్టకపోదురు. మంచాన పడకపోయేవాడిని. ఉన్నకాడికి వ్యవసాయం చేసుకునేటోడిని.
రైతుబంధు, రైతుబీమా, కరెంట్ మంచిగా ఉంది. రైతుకు ఇబ్బంది అనే మాట లేదు. పంటకు మద్దతు ధర ఉంది. వ్యవసాయం బాగుంది. ఆనాడు కరెంట్ లేదు. మూడు గంటల కరెంట్తో రైతులకు కష్టాలు తప్పవు. పొలం పారదు.. పంట పండదు. అప్పుడు మోటార్లు కాలిపోయేవి. మూడు గంటల కరెంట్తో పొలం ఎప్పుడు పారుతది. అదే సమయంలో సబ్ స్టేషన్, ట్రాన్స్ఫార్మర్ ఏమన్న అయితే ఎలా..? రైతుకు ఇంకో నౌకరి లేదు.. వారికి వ్యవసాయమే నౌకరి. రైతు ఎట్ల బతకాలే. రైతు కష్టాలను తీర్చుతున్నది కేసీఆర్ మాత్రమే. కేసీఆర్ పాలన బాగుంది. కరెంట్ విషయంలో ఈ ప్రభుత్వం బాగా పని చేస్తుంది. ఆనాడు కరెంట్ లేకపోవడం వల్లే బావుల కాడికిపోయి.. దొంగలతోని దెబ్బలు తిన్నాను. కరెంట్ మంచిగా ఉంటే నేను దొంగలతో దెబ్బలు తినకపోయేవాడిని, ఇట్ల మంచాన పడకపోయేవాడిని. ఈ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి రావాలి. ఆయన కన్నతండ్రిలా ఉన్నారు జనాలకు అని రైతు లింగ తెలిపాడు.