HomeTelanganaA Mothers Heart Also Stopped Because She Could Not Bear The Death Of Her Son
గుండెపోటుతో ఆటో డ్రైవర్ మృతి
కన్నకొడుకు మృతిని తట్టుకోలేక ఓ తల్లి గుండె కూడా ఆగింది. అరగంట వ్యవధిలోనే ఇద్దరు మృతిచెందిన ఘటన మెదక్ జిల్లా హవేళీ ఘనపూర్ మండలంలోని కూచన్పల్లి గ్రామంలో చోటుచేసుకున్నది.
కొడుకు మరణంతో ఆగిన తల్లి గుండె
అరగంట వ్యవధిలో ఇద్దరు కన్నుమూత
మెదక్ జిల్లా కూచన్పల్లిలో హృదయ విదారక ఘటన
మెదక్ అర్బన్, జనవరి 6 : కన్నకొడుకు మృతిని తట్టుకోలేక ఓ తల్లి గుండె కూడా ఆగింది. అరగంట వ్యవధిలోనే ఇద్దరు మృతిచెందిన ఘటన మెదక్ జిల్లా హవేళీ ఘనపూర్ మండలంలోని కూచన్పల్లి గ్రామంలో చోటుచేసుకున్నది. కుటుంబీకులు, గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. కూచన్పల్లికి చెందిన వీరప్పగారి నర్సాగౌడ్ (39) ఆటోడ్రైవర్. ఇతడికి భార్య, ఇద్దరు పిల్లలు, తల్లి లక్ష్మి(60) ఉన్నారు. శనివారం తెల్లవారుజామున ఛాతిలో నొప్పి వస్తుందని నర్సాగౌడ్ చెప్పడంతో కుటుంబ సభ్యులు దవాఖానకు వెళ్దామని చెప్పారు. కానీ, చిన్న నొప్పే అని తేలిగ్గా తీసుకొని పడుకున్న తర్వాత కొద్దిసేపటికి పిలిస్తే పలకలేదు.
కుటుంబ సభ్యులు వెంటనే నర్సాగౌడ్ను దవాఖానకు తీసుకెళ్లగా వైద్యులు పరీక్షించి అప్పటికే మృతిచెందినట్టు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న తల్లి దవాఖానకు వెళ్లింది. కొడుకు మృతదేహంపై పడి భోరున విలపించిన ఆమె ఒక్కసారిగా కుప్పకూలింది. వెంటనే వైద్యులు పరిశీలించి లక్ష్మి కూడా మృతి చెందినట్టు తెలిపారు. అరగంట వ్యవధిలో తల్లీకొడుకు మృతి చెందడంతో గ్రామంలో విషాధచాయలు అలుముకున్నాయి.