హనుమకొండ చౌరస్తా, ఆగస్టు 13: ఏడు సంవత్సరాల తర్వాత ఓ మాతృమూర్తి తన పిల్లలను కలుసుకొన్న ఘటన హనుమకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకొన్నది. ఏసీపీ కిరణ్కుమార్, ఇన్స్పెక్టర్ శ్రీనివాస్జీ తెలిపిన వివరాల ప్రకారం.. 2015లో హనుమకొండ యాదవనగర్కు చెందిన లక్ష్మి మతిస్థిమితం సరిగా లేక తన కుటుంబం నుంచి తప్పిపోయి చెన్నైకి చేరింది. అక్కడ అన్బగం రిహాబిలిటేషన్ సెంటర్ వారు ఆమెను చేరదీసి మానసికపరమైన చికిత్స చేయించారు.ఏడేండ్ల తరువాత ఆమె తన వివరాలు చెప్పడంతో హనుమకొండలోని యాదవనగర్కు చెందిన లక్ష్మిగా గుర్తించారు. వెంటనే వారు హనుమకొండ పోలీసులకు సమాచారం ఇచ్చారు.
అక్కడి వారు వీడియో కాల్ ద్వారా కుటుంబ సభ్యులతో మాట్లాడించారు. ఆమె భర్త, కుమారుడు చెన్నై వెళ్లి శనివారం ఇంటికి తీసుకొచ్చారు. కూతురు బీటెక్ ఫస్ట్ ఇయర్లో ఉండగా ఆమె తప్పిపోయింది. ఆ తరువాత కూతురి వివాహం కాగా ఇప్పుడు కూతురికి పాప కూడా ఉన్నది. శనివారం తల్లి లక్ష్మిని చూసిన కొడుకు, కూతురు మురిసిపోయారు. చనిపోయిందనుకున్న తల్లి హనుమకొండ పోలీసుల చొరవతో తమ చెంతకు చేరడం ఎంతో ఆనందంగా ఉన్నదన్నారు. ఇలా మళ్లీ అందరినీ కలుస్తాననుకోలేదని లక్ష్మీ సైతం ఆనందాన్ని వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా హనుమకొండ ఏసీపీ కిరణ్కుమార్, ఇన్స్పెక్టర్ శ్రీనివాస్జీ, అన్బగం రిహాబిలిటేషన్ సెంటర్ యాజమాన్యానికి ఆ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.