జనగామ చౌరస్తా, ఆగస్టు 1: నవమాసాలు మోసి, కని పెంచిన తల్లే ఏడాది వయసున్న కూతురిని నీటిసంపులోకి తోసేసింది. తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న బిడ్డ బరువు దించుకోవాలని ఈ ఘాతుకానికి పాల్పడింది. బంధువుల ముందు తాను బద్నాం కాకుండా గొలుసు దొంగ పాపను తోసేశాడని బుకాయించింది. పోలీసుల దర్యాప్తులో నేరం అంగీకరించి బోరున విలపించింది.
వెస్ట్జోన్ డీసీపీ సీతారాం వివరాల ప్రకారం.. జనగామ జిల్లాకేంద్రం లోని అంబేద్కర్నగర్ ఏరియా రైల్వేట్రాక్ పక్కన ఉంటున్న నడిగోటి భాస్కర్-ప్రసన్న దంపతులకు మూడున్నర ఏండ్ల కుమారుడు నవనీత్, ఏడాది వయసున్న కూతురు తేజశ్రీ ఉన్నారు.
పుట్టినప్పటి నుంచి పిల్లలిద్దర్నీ అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. నవనీత్ గుండెకి రంధ్రం ఉండగా ఇటీవలే రూ.8.50 లక్షలు పెట్టి ఆపరేషన్ చేయించారు. బిడ్డ తేజశ్రీకి పుట్టుకతో మాటలు రాకపోవడం, కాళ్లు చేతులు కదపపోవడం వంటి అనారోగ్య సమస్యలున్నాయి. ఇటీవల తేజశ్రీని దవాఖానకు తీసుకెళ్లగా భవిష్యత్తులో కూడా మాటలతోపాటు లేచి నడిచే అవకాశం లేదని వైద్యులు తెలుపడంతో దంపతులు తీవ్ర మానసిక వేదనకు గురయ్యారు.
బంధువులు, చుట్టుపక్కల వారు అనారోగ్య సమస్యలున్న పిల్లలతో ఎంతకాలం బతుకీడుస్తారనే మాటలు ప్రసన్నను మానసికంగా మరింత కుంగదీశాయి. ఈ క్రమంలో సోమవారం ఉదయం 11.30 గంటల ప్రాంతంలో ఎవరూ లేని సమయంలో ప్రసన్న తన కూతురిని ఇంట్లో ఉన్న నీటి సంపులో పడేసింది. కాసేపటి తర్వాత తానే పాపను బయటకు తీసింది.
పాపను తానే చంపినట్టు తెలిస్తే కుటుంబసభ్యులతోపాటు బంధువులు, చుట్టుపక్కలవారు అసహ్యించుకుంటారనే భయంతో నేరం గొలుసు దొంగపై మోపింది. ‘తలకు హెల్మెట్ పెట్టుకొని, ముఖానికి మాస్క్ ధరించిన గుర్తు తెలియని గొలుసు దొంగ ఇంట్లో చొరబడి పుస్తెల తాడు తెంపుతుండగా పెనుగులాట జరిగిందని, అతడు తేజశ్రీని నీటి తొట్టిలో పడేసి పరారయ్యాడని కట్టు కథ అల్లింది.
‘క్రైమ్ సీన్ రీ కన్స్ట్రక్షన్’లో చైన్ స్నాచింగ్ ప్రయత్నం జరిగినట్టు పోలీసులకు ఎలాంటి ఆధారాలు లభించలేదు. దర్యాప్తులో ప్రసన్న పొంతనలేని సమాధానాలు చెప్పింది. పోలీసులు తమదైన శైలిలో లోతుగా దర్యాప్తు చేయగా తానే నేరం చేసినట్టు ప్రసన్న అంగీకరించింది. భర్త భాస్కర్ ఫిర్యాదు మేరకు పోలీసులు ప్రసన్నపై హత్య కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు.