మద్యం బాటిల్లో మిగిలిన లక్కీ డ్రాప్ కోసం జరిగిన గొడవలో స్నేహితుడిని ఇద్దరు యువకులు చంపేశారు. ఈ విషయం తెలిసిన ఓ యువకుడి తల్లి వెంటనే కొడుకును కాపాడుకోవాలని చూడకుండా పోలీసులకు పట్టించింది. యాదాద్రి భువనగిరి జిల్లా మేడిపల్లిలో ఈ ఘటన చోటుచేసుకుంది.
యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మేడిపల్లి గ్రామానికి చెందిన రాగీరు మధు(25), గాంధారి చరణ్, ఊట్ల నవీన్ ముగ్గురు స్నేహితులు. వీరు ముగ్గురు మద్యానికి బానిసలుగా మారారు. వీరిలో చరణ్ అంబులెన్స్ డ్రైవర్గా పనిచేస్తుండగా.. నవీన్ ఆటో నడుపుతున్నాడు. మధు మాత్రం ఏ పనిచేయట్లేదు. ఇదిలా ఉంటే శుక్రవారం ఉదయం మద్యం మత్తులో ఇంటికి వెళ్లిన చరణ్.. మధును హత్య చేసినట్లు తన తల్లితో చెప్పాడు. చంపేసిన తర్వాత చెరువు సమీపంలోని ఇసుక దిబ్బలో ఉన్న గడ్డిలో పాతి పెట్టానని తెలిపారు. ఈ విషయం తెలియగానే ఆ తల్లి.. కొడుకును కాపాడుకోవాలని చూడలేదు. వెంటనే పోలీసులకు సమాచారం అందించింది.
చరణ్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించగా జరిగిన విషయాన్ని బయటపెట్టాడు. ఈ నెల 21వ తేదీ సాయంత్రం మేడిపల్లి ప్రభుత్వ పాఠశాల వెనుక మధు, నవీన్తో కలిసి తాగానని చెప్పాడు. ఆ సమయంలో లక్కీ డ్రాప్ కోసం మధు తమతో వాగ్వాదానికి దిగాడని తెలిపాడు. ఆ కోపంలో రాడ్తో కొట్టడం మధు అక్కడికక్కడే మరణించాడని పేర్కొన్నాడు. ఈ విషయం బయటపడకూడదని ఉదయం 4 గంటల సమయంలో శామీర్పేట వాగు వద్దకు తీసుకెళ్లి అక్కడే ఉన్న ఇసుక దిబ్బలో మధు మృతదేహాన్ని పాతిపెట్టినట్లుగా వివరించాడు.
మరోవైపు మధుకు రెండు మూడు రోజులైనా ఇంటికి వెళ్లకుండా బయటకు తిరగడం అలవాటు. దీంతో కొడుకు రాకపోయినప్పటికీ అతని తల్లిదండ్రులు వెతకలేదు. కానీ తన కొడుకు చనిపోయాడని పోలీసులు తెలపడంతో విషయం తెలిసి.. శోకసంద్రంలో మునిగిపోయారు. కాగా, పరారీలో ఉన్న మరో నిందితుడు నవీన్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.