రామడుగు, మార్చి 18 : ఓ వ్యక్తి గుండెపోటుకు గురై రోడ్డుపైనే ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతుండగా సీపీఆర్ చేయడంతో ప్రాణాలు నిలిచాయి. కరీంనగర్కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి కట్ట కిరణ్కుమార్ శనివారం ఉదయం 10.30గంటల ప్రాంతంలో కరీంనగర్ నుంచి రామడుగు వైపు ద్విచక్రవాహనంపై వస్తుండగా, వెదిర పరిధిలోని రాజాజీనగర్ ప్రాథమిక పాఠశాల సమీపంలో గుండెపోటుకు గురయ్యాడు.
ద్విచక్ర వాహనం పైనుంచి కింద పడిపోయిన కిరణ్కుమార్ అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. అదే సమయంలో పెట్రోలింగ్లో భాగంగా వెదిర వైపు పోలీస్ వాహనంలో హెడ్కానిస్టేబుల్ శంకర్, ఎమ్టీ సెక్షన్ పెట్రోకార్ డ్రైవర్ భగవాన్ వచ్చారు. కిరణ్ను గమనించిన పెట్రోకార్ డ్రైవర్ భగవాన్ సీపీఆర్ చేసి ప్రాణాలను రక్షించాడు. కొంత సేపటి తరువాత కిరణ్కుమార్ స్పృహలోకి రావడంతో 108 వాహనంలో కరీంనగర్ దవాఖానకు తరలించారు. కాగా, రామడుగు పెట్రోకార్ డ్రైవర్ భగవాన్ ఇప్పటి వరకు సీపీఆర్ ద్వారా నలుగురిని కాపాడాడు. భగవాన్ చొరవను పలువురు ప్రశంసించారు.