మంథని: పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఉప్పట్ల గ్రామంలో దారుణం జరిగింది. భార్యాభర్తల మధ్య మొదలైన గొడవ చినుకు చినుకు గాలివానలా మారినట్లు పెరిగి పెద్దదైంది. చివరికి పెద్ద మనుషుల మధ్యకు వెళ్లింది. పెద్ద మనుషులు పంచాయతీ నిర్వహిస్తుండగా.. తాను ఎట్టిపరిస్థితుల్లో భర్తతో ఉండబోనని చెప్పి భార్య అక్కడి నుంచి బయలుదేరింది. దాంతో ఆగ్రహించిన భర్త ఆమెను వెంబడించి బండరాయితో తలమీద కొట్టి చంపాడు.
వివరాల్లోకి వెళ్తే.. ఉప్పట్ల గ్రామానికి చెందిన కాసిపేట రేణుకకు (35), ఆమె భర్తకు మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో గొడవలు మరింత ముదరడంతో శనివారం పెద్ద మనుషుల మధ్య పంచాయతీ పెట్టారు. పంచాయతీ జరుగుతుండగా రేణుక తాను భర్తతో కాపురం చేసేది లేదని తెగేసి చెప్పింది. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోతుండగా ఆగ్రహించిన భర్త ఓ బండరాయి తీసుకుని ఆమెను వెంబడించాడు. ఆమె దొరకగానే తలపై బండరాయితో కొట్టి హత్యచేశాడు.
పట్టపగలు నడివీధిలో దారుణ హత్య జరుగడంతో గ్రామంలో కలకలం చెలరేగింది. గ్రామస్తుల ద్వారా సమాచారం అందుకున్న మంథని పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు.