హైదరాబాద్, జూలై 1 (నమస్తే తెలంగాణ) : ఈ నెల 3న వాయవ్య బంగాళాఖాతం పరిసరాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో రానున్న వారంపాటు ఏపీలో భారీ, తెలంగాణలో మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో వానకాలం ప్రారంభమై నెల గడుస్తున్నా ఆశించిన స్థాయిలో వర్షాలు పడకపోవడంతో రైతులంతా జూలై, ఆగస్టుపైనే ఆశలు పెట్టుకున్నారు. అయితే, వాతావరణ శాఖ వెల్లడించిన సమాచారం ఆధారంగా జూలైలోనూ పెద్దగా వర్షాలు పడే అవకాశం లేదని అధికారులు చెప్పడం రైతాంగాన్ని ఆందోళనకు గురిచేస్తున్నది. జూన్లో ఏకంగా 17 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైనట్టు అధికారులు వెల్లడించారు.