రామచంద్రాపురం, మార్చి 2: ఓఆర్ఆర్పై ఓ లారీ బీభత్సం సృష్టించింది. అదుపు తప్పిన లారీ ర్యాంపును ఢీకొట్టి కింద ఉన్న గుడిసెపై పడటంతో అందులో నిద్రిస్తున్న ముగ్గురు దుర్మరణం చెందారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా కొల్లూర్ వద్ద గురువారం తెల్లవారుజామున చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటక రాష్ర్టానికి చెందిన కొందరు కార్మికులు ఓఆర్ఆర్పైన చెట్లకు నీరు పోసే పనిచేస్తున్నారు. కొల్లూర్ టోల్గేట్ ప్లాజా వద్ద రింగురోడ్డు కింద గుడిసెలు వేసుకొని అక్కడే నివాసం ఉంటున్నారు.
గురువారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో బియ్యం లోడ్తో హర్యానా నుంచి ఏపీలోని చిత్తూరుకు వెళ్తున్న లారీ కొల్లూర్ సమీపంలోకి రాగానే అదుపుతప్పి ర్యాంపుపై నుంచి గుడిసె మీద పడింది. దీంతో గుడిసెలో నిద్రిస్తున్న బాబురాథోడ్ (48), కమలీబాయ్ (43), బసప్ప రాథోడ్ (23) అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ముగ్గురూ ఒకే కుటుంబానికి చెందిన వారు. ఈ ఘటనతో కార్మికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఘటనా స్థలాన్ని డీసీపీ శిల్పవల్లి, ఏసీపీ నర్సింహారావు పరిశీలించారు. ఇన్స్పెక్టర్ సంజయ్కుమార్, ఎస్సై శశికాంత్రెడ్డి, పోలీస్ సిబ్బంది క్రేన్ సాయంతో లారీని బయటకు తీసి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పటాన్చెరు ప్రభుత్వ దవాఖానకు తరలించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి ఘటనా స్థలానికి వచ్చి బాధిత కుటుంబానికి రూ.50 వేల ఆర్థిక సాయం అందజేశారు. పోలీసులు లారీ డ్రైవర్ ముబారక్ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.