ధర్మారం,ఆగస్టు21: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం కొత్తపల్లి గ్రామంలో చిరుతపులి కలకలం సృష్టించింది. లేగదూడను ఎత్తుకెళ్లి చంపి తిన్నది. స్థానికులు, ఫారెస్ట్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రైతు అజ్మీరా మోతీలాల్ నాయక్ ఆవులను పెంచుతున్నాడు. ఈ క్రమంలో రోజు మాదిరిగానే గ్రామ శివారులోని తన పొలం వద్ద ఆదివారం రాత్రి రెండు ఆవులను, లేగదూడను కట్టేసి, మేత వేసి ఇంటికి వచ్చాడు.
సోమవారం తెల్లవారు జామున వన్య మృగం దాడి చేసి లేగదూడను సమీప కర్రెగుట్టలోకి లాక్కెళ్లి చంపి తిని కళేబరాన్ని అక్కడే వదలి వేసి వెళ్లింది. కాగా, రైతు యధావిధిగా తన పొలం వద్దకు వెళ్లగా లేగదూడ కనించలేదు. దీంతో ఆందోళన చెందిన రైతు దాని అచూకీ కోసం వెతుకుతూ వెళ్లాడు. లేగదూడను లాక్కెళ్లినట్లుగా అనవాళ్లు, జంతు పాదముద్రలు కనిపించటంతో వాటిని గమనిస్తూ రైతు కర్రెగుట్టకు వెళ్లగా అక్కడ లేగదూడ కళేబరం కనిపించింది. వెంటనే గ్రామానికి వచ్చి ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చాడు.
దీంతో ఫారెస్ట్ డిప్యూటీ రేంజి అధికారి సీహెచ్ స్వాతి, ధర్మారం ఎఫ్బీవో ఎం స్వాతి కలిసి ఘటనా స్థలానికి వెళ్లి పంట చేలల్లో కనిపించిన పాదముద్రలను పరిశీలించారు. అవి చిరుతపులి పాదముద్రలేనని వారు నిర్ధారించారు. ఈ సందర్భంగా ఫారెస్ట్ డిప్యూటి రేంజర్ స్వాతి మాట్లాడుతూ రైతులు అప్రమత్తంగా ఉండాలని, పొలాలకు గుంపులుగా కర్రలు, గొడ్డండ్లతో వెళ్లాలని సూచించారు.