హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తాజాగా మరో పేరు ప్రముఖంగా వినిపిస్తున్నది. కేంద్రమంత్రి కిషన్రెడ్డితో సన్నిహిత సంబంధాలు ఉండటంతోపాటు ఆయన అనుచరుడిగా ఉన్న నందకుమార్ మాదిరిగానే అం బర్పేటకు చెందిన పోగులకొండ ప్రతాప్గౌడ్ అనే ఓ న్యాయవాది కూడా ఈ కేసులో భాగస్వామి అయినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎమ్మెల్యేల ఎర కేసు వెలుగులోకి వచ్చిన తరువాత దేశవ్యాప్తంగా వివిధ మీడి యా సంస్థలు ఈ వ్యవహారం లోతుల్లోకి వెళ్లి పరిశోధిస్తున్నాయి. ఈ పరిశోధనల్లో భాగంగా ప్రతాప్గౌడ్ పేరు వెలుగులోకి వచ్చింది. ప్రతాప్గౌడ్ గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. మాజీ ఎంపీ వీ హనుమంతరావు అనుచరుడిగా కొనసాగిన ఈ ప్రతాప్… 2016లో అంబర్పేట డివిజన్ నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేశాడు. 2011 ఓట్లు సాధించి ఓటమి పాలయ్యాడు. కాంగ్రెస్ పార్టీలో సాధారణ కార్యకర్తగా దాదాపు 20 ఏండ్లకు పైగా పని చేశాడు. అంతకంటే ముందు నుంచే అడ్వకేట్గా స్థానికంగా ప్రాక్టీసు చేస్తూనే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వీ హనుమంతరావుకు అత్యంత సన్నిహితుడిగా మారాడు. ఆ సమయంలోనే తెర వెనుక లిటిగేషన్ ల్యాండ్, కబ్జా భూము లు, ఫౌజీ బిట్లలో జోక్యం చేసుకొని సెటిల్మెంట్ చేస్తూనే రాజకీయ నాయకులకు లీగల్ అడ్వైజర్ స్థాయికి ఎదిగాడు. మూడేండ్ల కింద ట బీజేపీలో చేరినట్టు తెలిసింది. అప్పట్నుంచి కేంద్ర మంత్రి కిషన్రెడ్డికి అనుచరుడిగా వ్యవహరిస్తున్నాడు. న్యాయవాది అయిన ప్రతాప్ అంబర్పేట్ నియోజకవర్గంలో సివిల్ వివాదాలను డీల్ చేయడంలో సిద్ధహస్తుడిగా పేరున్నది. ప్రతాప్గౌడ్ మొదట్లో అంబర్పేట్లోని ప్రేమ్నగర్ కాలనీలో నివాసం ఉండేవాడు. ప్రస్తుతం బంజారాహిల్స్లో కార్యాలయాన్ని ప్రారంభించారు. 2018లో బీజేపీలోకి వచ్చి కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ముఖ్య అనుచరుడిగా మారిన ప్రతాప్గౌడ్ బోర్డు రూమ్ అడ్వకేట్లలో ఒకరిగా కొనసాగుతున్నాడు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి ప్రతాప్గౌడ్తోనూ బీజేపీ దూతలు మాట్లాడిన ఫోన్ కాల్ డాటా కూడా ఉన్నట్టు తెలుస్తున్నది.