Congress | ఆసిఫాబాద్/ ఆదిలాబాద్, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ): ఆసిఫాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి శ్యాంనాయక్ ఇంటి ఎదుట గురువారం రాత్రి డబ్బుల కోసం పెద్ద ఎత్తున ప్రజలు ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ అభ్యర్థిగా శ్యాంనాయక్ నామినేషన్ కార్యక్రమానికి వివిధ మండలాల నుంచి ప్రజలను ఆసిఫాబాద్కు తరలించారు. భోజనాలు పెట్టి డబ్బులు ఇస్తామని తీసుకొచ్చారు. అయితే.. రాత్రి 9 గంట లు అవుతున్నా.. తమకు ఇంకా డబ్బులు ఇవ్వలేదని ఆరోపిస్తూ కొందరు శ్యాంనాయక్ ఇంటి ఎదుట ఆందోళనకు దిగారు.
భోజనం కూడా పెట్టలేదని ఆరోపించారు. ఆదిలాబాద్ అభ్యర్థి కంది శ్రీనివాస్రెడ్డికి మద్దతుగా డైట్ కళాశాల మైదానంలో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి హాజరుకావడంతో.. డబ్బులు ఇస్తామని జనాలను తరలించారు. మధ్యాహ్నం 3:30 గంటలకు సభ ముగిసింది. సభ ముగిసినా తమకు ముందుగా చెప్పిన విధంగా డబ్బులు ఇవ్వడం లేదని కాంగ్రెస్ అభ్యర్థి ఇంటి ఎదుట భారీ సంఖ్యలో ఆందోళనకు దిగారు. డబ్బులు ఎందుకివ్వరని వారిని నిలదీశారు.