ఎల్లారెడ్డి, సెప్టెంబర్ 23: ఆ దంపతులకు ఒకరిపై ఒకరికి అమితమైన ప్రేమ.. జీవితాంతం తోడుగా ఉండాలని, కష్టసుఖాలను పంచుకోవాలని ఇద్దరు బాస చేసుకున్నారు. కానీ విధి మరోలా తలిచింది. ఆ జంటను విడదీసింది. రెండేండ్ల కింద అనారోగ్యంతో భార్య చనిపోయింది. తాను కూడా భార్య దగ్గరకు వెళ్లాలని అనుకోని రోజు లేదు. చివరికి గురువారం ఆమె సమాధి దగ్గరే గుండెపోటుతో కుప్పకూలి పోయాడు ఆ వ్యక్తి.. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో గురువారం చోటుచేసుకున్నది.
ఎల్లారెడ్డికి చెందిన నిమ్మ ప్రభాకర్ (59) సంగారెడ్డికి వెళ్లి అక్కడే వ్యాపారంలో స్థిరపడ్డాడు. రెండేండ్ల కింద భార్య అనారోగ్యంతో మృతిచెందింది. గురువారం పితృపక్షాల నేపథ్యంలో వ్యవసాయభూమిలో ఉన్న భార్య సమాధి వద్ద నివాళులు అర్పించేందుకు వెళ్లి అక్కడే కుప్పకూలిపోయాడు. గుండెపోటుతో మృతి చెందాడు. ప్రభాకర్కు ముగ్గురు కూతుళ్లు కాగా, ఇద్దరికి వివాహమైంది. మూడో కూతురు ప్రసన్న తండ్రి అంత్యక్రియలు జరిపింది.