మహబూబాబాద్, ఆగష్టు 11 : భారత జాతీయ ఉద్యమమే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ప్రేరణగా నిలిచిందని, ఆ ఉద్యమ స్ఫూర్తితోనే ప్రస్తుత సీఎం కేసీఆర్ ఆనాడు ఉద్యమ రథసారథిగా తెలంగాణను సాధించారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలో మంత్రి ఫ్రీడం రన్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొర్రూర్ లోని అంబేద్కర్ చౌరస్తా వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి పుష్పాంజలి ఘటించారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్డు లో ఏర్పాటు చేసిన భారీ జాతీయ పతాకం తరహాలో తొర్రూరు జెడ్పీ పాఠశాలలో ఏర్పాటు చేయనున్న భారీ జాతీయ పతాక కార్యక్రమానికి మంత్రి శంకుస్థాపన చేశారు.
అనంతరం మంత్రి ఎర్రబెల్లి మాట్లాడూతూ..పోరాడి సాధించిన తెలంగాణ తెర్లు కాకుండా అభివృద్ధిలో దేశంలోనే అగ్రగామిగా నిలబడడానికి సీఎం కేసీఆర్ గాంధీజీ స్ఫూర్తితో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. దేశంలో 20 అత్యున్నత ఆదర్శ గ్రామాలను లెక్క తీస్తే అందులో 19 గ్రామాలు తెలంగాణవే రావడమే ఇందుకు నిదర్శనమని మంత్రి అన్నారు.
భారత స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తిని భావితరాలకు అందించాలన్న లక్ష్యంతోనే స్వతంత్ర భారత వజ్రోత్సవాల కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నామని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు ప్రజలు ప్రత్యేకించి యువత, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.