కొత్తగూడెం క్రైం, మే 25 : పోలీసు బలగాలే లక్ష్యంగా మావోయిస్టులు(Maoists) ఏజెన్సీ ప్రాంతంలో దాచిన భారీ డంపును(Huge dump సరిహద్దు ఆంధ్రప్రదేశ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా శనివారం విలేకరులకు వెల్లడించారు. ఏపీ రాష్ట్రం అల్లూరి సీతారామరాజు జిల్లాలో పోలీస్ బలగాలు మావోయిస్టుల కోసం కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో జీకే వీధి మండలం సీలేరు పోలీస్స్టేషన్ పరిధిలో గల పనసాలబండ గ్రామ సమీప అటవీ ప్రాంతంలో మావోయిస్టుల డంపును పోలీసులు గుర్తించారు.
కూంబింగ్ నిర్వహించే పోలీస్ బలగాలను టార్గెట్ చేస్తూ మావోయిస్టులు మందుపాతర పాతిపెట్టేందుకు వ్యూహం రచించినట్లు ఎస్పీ వెల్లడించారు. ఆ ప్రాంతం నుంచి 6 స్టీల్ క్యారేజ్ ల్యాండ్ మైన్స్, రెండు డైరెక్షనల్ మైన్స్, పేలుడు పదార్థం(కేఈఎల్ కంపెనీ), 150 మీటర్ల విద్యుత్ వైరు, 5 కేజీల మేకులు, ఇనుప నట్లు, మావోయిస్టు పార్టీకి చెందిన సాహితీ రచన పుస్తకాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
అల్లూరి జిల్లాలో మావోయిస్టులు దాచిన డంపులన్నింటినీ త్వరలోనే స్వాధీనం చేసుకుంటామని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. అనంతరం డంపును రికవరీ చేసిన జి. మాడుగుల ఎస్సై ఏ.శ్రీనివాసరావు, సీలేరు ఎస్సై రామకృష్ణ, ఆర్ఎస్సై జాన్ రోహిత్లను ఎస్పీ తుహిన్ సిన్హా అభినందించారు. సమావేశంలో చింతపల్లి సబ్ డివిజన్ అదనపు ఎస్పీ కె.ప్రతాప్ శివకుమార్ పాల్గొన్నారు.