సుబేదారి, మార్చి 14: దళిత బాలుడు తరాజును తాకాడని కిరాణా దుకాణం యజమాని, అతడి భార్య కలిసి చితకబాదారు. బాలుడికి తీవ్ర గాయాలు కాగా చికిత్స కోసం వరంగల్ ఎంజీఎం హాస్పిటల్కు తరలించారు. ఈ ఘటన హనుమకొండ జిల్లా శాయంపేట మండలం పెద్దకొడెపాక గ్రామంలో తొమ్మిది రోజుల క్రితం జరగ్గా, ఆలస్యం వెలుగుచూసింది. పెద్దకొడెపాకకు చెందిన 14 ఏండ్ల బాలుడు ఈ నెల 6న ఫ్రూటీ కొనుక్కునేందుకు కిరాణా దుకాణానికి వెళ్లాడు. అతడు తరాజును తాకాడని షాప్ యజమాని రాజేందర్, అతడి భార్య కలిసి బాలుడిని తీవ్రంగా కొట్టి, దొంగతనం కోసం వచ్చాడంటూ కులం పేరుతో దూషించారు.
స్థానికులు ఆ బాలుడిని చికిత్స కోసం ఎంజీఎంకు తరలించారు. ఈ ఘటనపై బాలుడి తల్లిదండ్రులు శాయంపేట పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఘటన జరిగి వారం రోజులు గడుస్తున్నా దాడికి పాల్పడిన దుకాణ యజమానిపై కేసు నమోదు చేయకపోవడంతో పోలీసులపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ ఘటనలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకొని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో మంగళవారం హనుమకొండ పబ్లిక్గార్డెన్ అంబేద్కర్ జంక్షన్ వద్ద ధర్నా చేశారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే దేశవ్యాప్తంగా దళితులపై దాడులు జరుగుతున్నాయని కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మంద సంపత్ ఆరోపించారు.