హైదరాబాద్, ఏప్రిల్30 (నమస్తే తెలంగాణ): చేనేత వస్ర్తాలపై జీరో జీఎస్టీని అమలు చేయాలని ఆగస్టు 7న ఢిల్లీలో పద్మశాలీలు మ హా ప్రదర్శన నిర్వహించాలని నిర్ణయించినట్టు అఖిల భారత పద్మశాలి సంఘం నేత కందగట్ల స్వామి, చేనేత విభాగం జాతీయ అధ్యక్షుడు యరమాద వెంకన్న వెల్లడించారు. తమిళనాడు రాష్ట్రం సేలంలో ఆదివారం నిర్వహించిన పద్మశాలి మహా సంగమ ర్యాలీలో వారు పాల్గొని మాట్లాడారు. చేనేతపై కేంద్ర ప్రభుత్వం పన్నులు వేయడం దారుణమని, 17 నెలలుగా ఉద్యమిస్తున్నా కేంద్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.
చేనేత వస్ర్తాలపై జీరో జీఎస్టీ అమలు చేసే వరకూ పోరాడుతామని తేల్చి చెప్పారు. జీరో జీఎస్టీ ఉద్యమానికి మద్దతుగా తమిళనాడు పద్మశాలి సంఘం తీర్మానించిందని తెలిపారు. పద్మశాలి సంఘం తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు రవీంద్రన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కోశాధికారి కొకుల దేవేందర్, మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి చిలువేరు సునీత, ఇంజినీర్స్ విభాగం అధ్యక్షుడు పుట్టా పాండురంగయ్య, కార్యదర్శి వేణుమాధవ్, కర్ణాటక అధ్యక్షుడు జగదీశ్, కేరళ కార్యదర్శి సుధాకరన్, తెలంగాణ పద్మశాలి సంఘం అధ్యక్షుడు మచ్చ ప్రభాకర్రావు, కోస్తాంధ్ర అధ్యక్షుడు నాగేశ్వరరావు, తమిళనాడు నేతలు తంగరాజన్, వేంకటాచలపతి. వరల్డ్ వీవర్స్ ఆర్గనైజషన్ సౌతిండియా ఇన్చార్జి సేతుపతి, రమేశ్, గోవిందరాజన్, సంకు సుధాకర్, చిలువేరు పురుషోత్తం, ఉమా హేమలత పాల్గొన్నారు.