నల్లగొండ : దారి దోపిడీలకు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర దొంగల(Inter state Robberies)ముఠా ను నల్లగొండ పోలీసులు(Nallgonda police) అరెస్ట్ చేశారు. ఏడుగురు నిందితుల్ని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి ఒక కారు, 35 సెల్ ఫోన్లు, కత్తి, రాడ్ను స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ అపూర్వ రావు గురువారం ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు.
ఈ నెల 8న నల్లగొండ మండలం దండెంపల్లి గోశాల వద్ద డీసీఎంను ఆపీ డ్రైవర్ శ్రీనివాస్ పడుకున్నాడు. కారులో గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి రాడ్ తో కొట్టి అతడిని గాయపర్చి సెల్ ఫోన్ రూ. 1500 దొంగిలించి పారిపోయారని తెలిపారు. శ్రీనివాస్ ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు విచారణ చేపట్టామని ఆమె తెలిపారు.
గురువారం పానగల్లు బైపాస్ వద్ద టూ టౌన్ ఎస్ఐ , సిబ్బంది వాహన తనిఖీ(vehicle checking) లు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా మారుతి కారులో ఉన్న వ్యక్తులు పోలీసులను చూసి మిర్యాలగూడ వైపునకు పారిపోయారని తెలిపారు. పోలీసులు కారును వెంబడించి పట్టుకోగా కారులో ఉన్న ఏడుగురు నిందితులను, ఇనుపరాడ్ ,కత్తితో పాటు 39 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.
హైదరాబాద్ మాదన్నపేట్ కు చెందిన ఆటో డ్రైవర్ ఉబది అరవింద్ , విఘ్నేశ్ అలియాస్ విక్కీ, నల్లగొండ జిల్లా యాచారం మండలం మాల్ గ్రామానికి చెందిన కడమంచి గణేశ్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు వెల్లడించారు. అదేవిధంగా మర్రిగూడ కు చెందిన కరమంచి శ్రీహరి, నల్లగొండ జిల్లా నిడమనూర్ మండలం జంగాలవారి గూడెంకు చెందిన ఆలేటి వెంకటయ్యతో పాటు మరో ఇద్దరు మైనర్లను అరెస్టు చేశామన్నారు.
వీరంతా మద్యానికి బానిసై యాదగిరిగుట్ట, హాయత్ నగర్, ఎల్బీ నగర్ , చౌటుప్పల్ , నార్కట్పల్లి, నల్గొండ తదితర ప్రాంతాలలో జాతీయ రహదారులపై దారి దోపిడీలకు పాల్పడుతున్నారని ఆమె వివరించారు. మీడియా సమావేశంలో నల్గొండ డీఎస్పీ వి. నరసింహ రెడ్డి, నల్గొండ టూ టౌన్ సీఐ డి.చంద్రశేఖర్ రెడ్డి , నల్గొండ ట్రాఫిక్ సీఐ శ్రీను, ఎస్సైలు రాజశేఖర్రెడ్డి, భాస్కర్ రెడ్డి, కానిస్టేబుళ్లు శంకర్, బాలకోటి , గాంధీ , వెంకన్నలను జిల్లా ఎస్పీ అభినందించారు.