IIT | హైదరాబాద్, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ) : దేశవ్యాప్తంగా ఐఐటీల్లో నాలుగేండ్ల బీఈడీ కోర్సు త్వరలోనే అందుబాటులోకి రానున్నది. ఇంజినీరింగ్తో పాటు అన్నిరకాల కోర్సులు ఐఐటీల్లో అందుబాటులోకి వస్తుండగా, తాజాగా బీఈడీ కోర్సు కూడా ఈ జాబితాలో చేరనున్నది. ఇటీవలే నిర్వహించిన ఐఐటీ కౌన్సిల్ సమావేశంలో నాలుగేండ్ల బీఈడీ (ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం)ని ఐఐటీల్లో ప్రవేశపెట్టడంపై కూలంకషంగా చర్చించారు. ఈ కోర్సును ప్రవేశపెట్టేందుకు నాలుగు ఐఐటీలు ముందుకు రాగా, ఖరగ్పూర్ ఐఐటీలో నాలుగేండ్ల బీఈడీ కోర్సును ప్రవేశపెట్టాలని గతంలోనే నిర్ణయించారు.
నాలుగేండ్ల బీఈడీ కోర్సును డ్యూయల్ డిగ్రీ కోర్సుగా చెప్పుకోవచ్చు. మన దగ్గర డిగ్రీ మూడేండ్లు, బీఈడీ రెండేండ్లపాటు పూర్తిచేసే అవకాశం ఉన్నది. ఈ విధానంలో నాలుగేండ్లలోనే మూడేండ్ల డిగ్రీతోపాటు రెండేండ్ల బీఈడీ కోర్సులను ఒకే దఫాలో పూర్తిచేసేందుకు వీలవుతుంది. బీఏ బీఈడీ, బీఎస్సీ బీఈడీ, బీకాం బీఈడీల పేరుతో కోర్సులను నిర్వహించనున్నారు. ప్రస్తుత బీఈడీ కాలేజీల్లో బోధన అంతంత మాత్రంగానే ఉన్నదన్న విమర్శలున్నాయి. కొత్త టీచర్లను తయారుచేసేందుకు, శిక్షణనిచ్చేందుకు ఐఐటీలు ఉత్తమ కేంద్రాలుగా భావించిన కేంద్ర ప్రభుత్వం వీటిల్లో నాలుగేండ్ల బీఈడీని ప్రవేశపెట్టాలని నిర్ణయించింది.