హుజూరాబాద్, జూన్ 9 : పీవీ జిల్లాతోపాటు నియోజకవర్గంలో మరో రెండు కొత్త మండలాలు కావాలని డిమాండ్ చేస్తున్న మాజీ మంత్రి ఈటల రాజేందర్కు అధికారంలో ఉన్నప్పుడు ఆ విషయం గుర్తుకు రాలేదా? అని రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ సభ్యుడు వకుళాభరణం కృష్ణమోహన్రావు ప్రశ్నించారు. ఈటల పతనం ఆరంభమైందని, ప్రజలు ఆయన కల్లబొల్లి మాటలు నమ్మే రోజులు ఏనాడో పోయాయని ఎద్దేవా చేశారు. బుధవారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లోని టీఆర్ఎస్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. నాడు పీవీ జిల్లా చేయాలని ఉద్యమం చేసినవాళ్లను నీతి, జాతి లేనివాళ్లని తిట్టిన చరిత్ర ఈటలదని మండిపడ్డారు. రాష్ట్రంలోని చాలా నియోజకవర్గాల్లో డబుల్ బెడ్రూం ఇండ్లు పూర్తయి పేదోళ్లు అందులో నివాసం ఉంటున్నారని, ఈ విషయంలో ఈటల విఫలమయ్యారని విమర్శించారు. పింఛన్లు, రేషన్ కార్డులను వెంటనే మంజూరు చేయాలని సన్నాయి నొక్కులు నొక్కుతున్న ఈటల.. తాను పదవిలో ఉన్నప్పుడు ఎందుకు పట్టించుకోలేదని అడిగారు. ప్రభుత్వ డబ్బులతోనే అభివృద్ధి పనులు జరుగుతాయన్న విషయం ప్రతి ఒక్కరికీ తెలుసునని, ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి పనులు తన సొంత ఖర్చులతోనే చేసినట్టుగా చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రభావం తగ్గుతుందనే భావనతో తన స్వార్థం కోసం భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కమలాపూర్ మండలాన్ని వరంగల్ అర్బన్లో విలీనం చేశారని గుర్తుచేశారు. ‘పిడికెడు మంది నన్ను ఏమీ చేయలేరు’ అని మాట్లాడుతున్నారని, అయితే కేసీఆర్ చేతుల్లో ఉంది నాలుగు కోట్ల ప్రజలు అనే విషయాన్ని మరిచిపోవద్దని హితవుపలికారు. కురుక్షేత్రం కాబోతుందని ఈటల పదేపదే అంటున్నారని, దీన్ని బట్టి చూస్తే ఎన్నికల్లో ఆయన అల్లర్లు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని అర్థం చేసుకోవచ్చునని పేర్కొన్నారు. ఎవరిది నైతికమో, ఎవరిది అనైతికమో ప్రజలే నిర్ణయిస్తారని చెప్పారు. సమావేశంలో నాయకులు బండ శ్రీనివాస్, కొలిపాక శ్రీనివాస్, ఎడవెల్లి కొండాల్రెడ్డి, తాళ్ళపెల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు.
సీఎం కేసీఆరే తమ నాయకుడని, టీఆర్ఎస్లోనే కొనసాగుతామని రజక, నాయీబ్రాహ్మణ సంఘాల నాయకులు స్పష్టంచేశారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపెల్లి రాజేశ్వర్రావు ఇంటికి ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య రాగా, ఆయనను రజక, నాయీబ్రాహ్మణ సంఘాల నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. పార్టీలోనే ఉంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయా సంఘాల నాయకులు మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాలకు పెద్దపీట వేసిందని, పథకాలను, సంక్షేమ కార్యక్రమాలను వదులుకోలేమని చెప్పారు. పార్టీ నుంచి ఎవరు పోటీ చేసినా పనిచేస్తామని, భారీ మెజార్టీతో గెలిపిస్తామన్నారు. కులవృత్తులను ప్రోత్సహించింది ఒక్క టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమేనని ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో కులవృత్తుల కోసం మరింతగా నిధులు వెచ్చించనుందని, పెండింగ్ సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీఇచ్చారు.
హుజూరాబాద్టౌన్: ‘మూడేండ్ల క్రితం నీ అక్రమ ఆస్తుల గురించి నిరూపిస్తానని చెబితే.. మమ్మల్ని అక్రమంగా అరెస్ట్చేసి, పోలీసులతో కొట్టించింది నిజం కాదా?.. నిజమని నిరూపిస్తే హుజూరాబాద్ అంబేద్కర్ విగ్రహం సాక్షిగా నువ్వు, నీ కుటుంబ సభ్యులు ముక్కు నేలకు రాస్తారా?’ అని ఈటల రాజేందర్ దళిత బాధిత సంఘం అధ్యక్షుడు తిప్పారపు సంపత్ సవాల్ విసిరారు. బుధవారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈటల జనసేన, ఈటల యువసేన పేరుతో హుజూరాబాద్తో సంబంధం లేని కొందరితో వాస్తవాలను కప్పిపుచ్చుతున్నారని, ప్రజలను తప్పుదారి పట్టించేలా వ్యవహరిస్తున్నారని అన్నారు. తమను బెదిరింపులకు గురిచేస్తున్నారని, ఇప్పటికైనా ఇలాంటివి మానుకోవాలని హితవుపలికారు. లేనైట్లెతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించారు. గడచిన ఏడేళ్ల పాలనలో మంత్రి హోదాలో ఎక్కడెక్కడ దళితులపై కేసులు పెట్టావో, ఎవరెవరిని ఇబ్బందులకు గురి చేశావో ఒక్కసారి ఆత్మ విమర్శ చేసుకోవాలని సూచించారు.