వనపరి : కొందరు పుట్టుక చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుంది. వర్తమానమే కాదు భవిష్యత్ తరాలకు, చరిత్రకు కారకులుగా మిగులుతారని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. అదే కోవలో ప్రజా సంక్షేమమే పరమావధిగా పనిచేస్తున్న నాయకుల్లో సీఎం కేసీఆర్ (CM KCR )చరిత్రలో సుస్థిర స్థానం సంపాదించారని పేర్కొన్నారు.
శుక్రవారం సీఎం కేసీఆర్ జన్మదిన సందర్భంగా ఖిలా ఘనపురం బ్రాంచ్ కెనాల్ వయో డెక్ట్ వద్ద షాపూర్, మనజీపేట, కందూర్, ఉప్పరపల్లి, అడ్డాకులకు సాగునీరు అందించే కాలువకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక రైతులు, ప్రజాప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. రైతులకు సమస్యలు లేకుండా అనేక పథకాలను తీసుకొచ్చిన నాయకుడు దేశంలో ఎవరూ లేరని అన్నారు. రైతుల అభ్యున్నతి కోసం అనుక్షణం తపించే నాయకుడు సీఎం కేసీఆర్ అని తెలిపారు.
ప్రతి పథకం. ప్రతి పని, ప్రతి ఫలితంలో కేసీఆర్ కనిపిస్తారని వెల్లడించారు. మనిషి యొక్క దార్శనికత, పార్టీ యొక్క పనితనం చరిత్ర గతిని, కాల గతిని ఎలా మారుస్తాయో తెలంగాణ రాష్ట్రం, కేసీఆఆర్ ఉదాహరణ అని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ను ఒప్పించి సాగునీటిని తీసుకొచ్చామని అన్నారు.
పెద్దమందడి గణపురం కాలువల ద్వారా 75 వేల ఎకరాలకు సాగునీటిని అందించేందుకు ఉన్న 25 టీఎంసీల కేటాయింపును 45 టీఎంసీలకు పెంచి సాగునీటిని సాధించామని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ (CM KCR BIRTHDAY) పుట్టినరోజు సందర్భంగా ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, స్థానిక నాయకులతో కలిసి మంత్రి నిరంజన్ రెడ్డి కేక్ కటింగ్ చేశారు. అనంతరం రైతులతో కలిసి భోజనం చేశారు.