హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ): ‘తెలంగాణలో చాలా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం.. కోట్ల రూపాయల నిధులు ఇచ్చాం’ అంటూ బీజేపీ సభలో ప్రధాని మోదీ అబద్ధాలు చెప్తుంటే.. చెప్పేదంతా జుమ్లా అని.. #జుమ్లాకింగ్మోదీ హ్యాష్ట్యాగ్ ట్విట్టర్లో హోరెత్తింది. మోదీ ప్రసంగంలో చెప్పిన తప్పుడు లెక్కలను సాక్ష్యాధారాలతో బయటపెట్టడంతో పాటు తెలంగాణ సీఎం కేసీఆర్, ప్రజలు అడిగిన ప్రశ్నలకు జవాబులేవంటూ నిలదీసింది.
మోదీ ప్రసంగం ప్రారంభమైనప్పటి నుంచి మాట్లాడటం పూర్తయ్యే వరకు ఈ హ్యాష్ట్యాగ్ టాప్ పొలిటికల్ ట్రెండింగ్గా నిలిచింది. ‘ప్రధాని మోదీ ఓ జుమ్లా కింగ్.. మాతాశిశు సంరక్షణ కింద కేంద్రం తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం ఇందుకోసం కేసీఆర్కిట్ పథకాన్ని అమలుచేస్తున్నది. ఇందుకు పార్లమెంట్ సమావేశాల సమయంలో కేంద్రం విడుదల చేసిన లెక్కలే సాక్ష్యం’ అంటూ పదుల సంఖ్యలో నెటిజన్లు ట్వీట్లు చేశారు.
మోదీ అధికారంలోకి వచ్చాక ఆకలి సూచీలో 63వ ర్యాంక్ నుంచి 101 స్థానానికి పడిపోయింది; ఎనిమిదేండ్లలో భారత్లో లివింగ్ కాస్ట్ పెరిగింది, కొనుగోలు శక్తి తగ్గింది; మేకిన్ ఇండియా, డిజిటల్ ఇండియా ఫెయిల్, స్మార్ట్సిటీ, ఉమెన్ సేఫ్టీ, స్టార్టప్ ఇండియా, స్కిల్ ఇండియా, బ్లాక్ మనీ, బ్యాంకు ఖాతాల్లో 15 లక్షలు, పది కోట్ల ఉద్యోగాలు, రైతు సంక్షేమం, లోక్పాల్ అన్నింటిలో ఫెయిల్; అవినీతిలో హైయెస్ట్ లెవల్; బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, ఐటీఐఆర్ ఇన్ హైదరాబాద్, తెలంగాణకు మెడికల్ కాలేజీలు, నీతి ఆయోగ్ రికమెండేషన్స్, ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్లు, కాజీపేట రైల్వే కోచ్ గురించి ఎందుకు మాట్లాడలేదు.. అంటూ కొన్ని గంటల్లోనే 80 వేలకుపైగా ట్వీట్లు వచ్చాయి. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, యువత ఇలా ఎవరికి వారు ట్విట్టర్లో ప్రధాని మోదీని కడిగిపారేశారు.
#జుమ్లాకింగ్మోదీతో కొన్ని ట్వీట్లు
ప్రామిస్ చేసింది సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు. డెలివరీ చేసింది గత 18 నెలల్లో 10 లక్షల ఉద్యోగాలు. ఇదేనా ఎనిమిదేండ్లలో మీరు చేసింది?
– మంత్రి కొప్పుల ఈశ్వర్
2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని మోదీ చెప్పారు. కానీ మోదీ ప్రభుత్వ విఫల విధానాలతో రైతుల ఆదాయం తగ్గింది. పెట్టుబడి రెట్టింపయ్యింది.
– మంత్రి, గంగుల కమలాకర్
ఎనిమిదేండ్లలో మోదీ ప్రభుత్వం సాధించింది సున్నా. ఏమీ సాధించని దాన్ని ప్రచారం చేసుకొనేందుకు పన్నుల రూపంలో వచ్చిన రూ.5 వేల కోట్లు ఖర్చు చేసింది. ములుగులో ట్రైబల్వర్సిటీకి రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయించినప్పటికీ కేంద్రం నుంచి అనుమతి రాలేదు.
– మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, సత్యవతిరాథోడ్
మోదీ గుజరాత్ సీఎంగా ఉన్న 2014లో ఇండియా రూపాయి విలువ ఒక డాలర్కు రూ.57 ఉంటే, ఆయన ప్రధాని అయ్యాక రికార్డు స్థాయిలో ఒక డాలర్కు రూ.78కి దిగజారి పోయింది.
– మంత్రి శ్రీనివాస్గౌడ్
ప్రధాని మోదీ ప్రసంగం నిస్సారంగా కరపత్రం తరహాలో సాగింది. ప్రత్యర్థులపై విమర్శలు గుప్పించే మోదీ.. టీఆర్ఎస్, కేసీఆర్ పేరు కూడా ప్రస్తావించకపోవడం ఆశ్చర్యకరం. సీఎం కేసీఆర్ సంధించిన ఏ ఒక్క ప్రశ్నకూ మోదీ జవాబు చెప్పలేదు. నూపుర్శర్మ వ్యాఖ్యల నేపథ్యంలో ఉదయ్పూర్ హత్యాకాండ వంటి ఘటనలతో ఉద్విగ్నంగా దేశం ఉన్న పరిస్థితిలో ఒక ప్రధానిగా మోదీ స్పందించాల్సి ఉండింది.
– ప్రొఫెసర్ నాగేశ్వర్
పాపం బీజేపీ. హైదరాబాద్లో మోదీ సభకు జనాలు లేక, కుర్చీలు నింపేందుకు కర్ణాటక నుంచి జనాలను తరలిస్తున్నది. బీజేపీ స్టార్ క్యాంపెయినర్ మోదీజీ మాట్లాడుతుంటే సభ నుంచి జనాలు వెళ్లిపోయారు. తెలంగాణ ప్రజలకు జుమ్లాలపై ఆసక్తి లేదనడానికి ఇదే నిదర్శనం
– క్రిశాంక్, టీఎస్ఎండీసీ చైర్మన్
గుజరాత్లోని వడ్గావ్కు చెందిన 50 వేల మహిళలు తాగునీటి సమస్యలపై పీఎం మోదీకి ఇటీవల లేఖలు రాశారు. ఇక యూపీలోని బుందేల్ఖండ్లో 13 జిల్లాల్లో తీవ్ర తాగునీటి ఇబ్బందులున్నాయి. తెలంగాణలో ఇంటింటికీ తాగునీరు అందుతున్నది. తెలుసుకోండి.
– పాటిమీది జగన్, టీఎస్టీఎస్ చైర్మన్
సుప్రీం లీడర్స్ (బీజేపీ నాయకులు) రన్ లోలా రన్ హైదరాబాద్లో కొనసాగుతున్నది. పౌరులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు లేవు. జస్ట్ జుమ్లా మాత్రమే ఉన్నది. పెద్దగా ఆశ్చర్యం ఏం కలిగించలేదు.
– నటుడు ప్రకాశ్రాజ్