ఖైరతాబాద్/తెలుగు యూనివర్సిటీ, ఆగస్టు 28: అల్లారుముద్దుగా పెంచుకొన్న కూతురు మరణాన్ని తట్టుకోలేని ఓ తండ్రి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఖైరతాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకొన్నది. పటేల్ బిల్డింగ్ సమీపంలో నివాసముండే కొమ్ముల కిశోర్కుమార్ (40) ప్రైవేట్ ఉద్యోగి. ఆయనకు భార్య ప్రియాంక, కుమార్తెలు ఆరాధ్య (5), అక్షయ (2) ఉన్నారు. ఆరాధ్యకు ఊపిరితిత్తుల్లో నీరు చేరడంతో ఆదివారం తీవ్ర అస్వస్థతకు గురైంది.
ఆ చిన్నారిని ఓ ప్రైవేట్ దవాఖానకు తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మరణించింది. కూతురు లేని బతుకు ఎందుకు అనుకున్నాడో ఏమో కానీ.. తానూ తనువు చాలించాలని అనుకున్నాడు. దీంతో లక్డీకాపూల్ ఎంఎంటీఎస్ రైల్వేస్టేషన్ వద్దకు వెళ్లి రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కిశోర్ కుమార్ మరణవార్త తెలుసుకొన్న స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. భార్యకు డబుల్ బెడ్రూం ఇల్లుతో పాటు చిన్న కుమార్తె పేరిట రూ.లక్ష ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.