హైదరాబాద్ : అనారోగ్యంతో మరణించిన 8 ఏళ్ల కుమారునికి అంత్యక్రియలు చేయలేక మృతదేహాన్ని ఒళ్లో పెట్టుకుని స్మశానంలో ఏడుస్తూ కూర్చున్నాడు బాలరాజ్ అనే వ్యక్తి. స్థానికంగా ఎవరూ సహాయం చేయకపోవడంతో ఏం చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్న బాలరాజ్ పరిస్థితిని చూస్తే గుండె తరుక్కుపోతుంది. బతికున్నప్పుడు తింటి పెట్టలేకపోయాను.. చనిపోయాక అంత్యక్రియలు చేయలేకపోతున్నాను అని బాలరాజ్ కుమారుని మృతదేహాన్ని చూస్తూ కుమిలి కుమిలి ఏడుస్తున్నాడు. కుమారుడి మృతదేహానికి అంత్యక్రియలు చేసేందుకు డబ్బులు లేకపోవడంతో స్మశాన వాటికలోనే 8 గంటలుగా కూర్చొని తండ్రి కన్నీరు పెట్టుకున్నాడు. ఈ హృదయ విదారక ఘటన మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో వెలుగు చూసింది.
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ప్రేమ్ నగర్ ప్రాంతంలో బాలరాజ్ అనే వ్యక్తి తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి జీవనం కొనసాగిస్తున్నాడు. స్థానికంగా ఉన్న పత్తి మిల్లులో బాలరాజ్ పని చేసేవాడు. ఇటీవల పత్తి మిల్లు మూతపడి ఉపాధి కోల్పోవడంతో ఆ కుటుంబం రోడ్డున పడింది. దివ్యాంగుడైన పెద్ద కుమారుడిని బాలరాజ్ వద్ద వదిలేసి చిన్న కుమారుడిని తీసుకొని పుట్టింటికి వెళ్లిపోయింది భార్య.
దీంతో బాలరాజ్ స్థానికంగా హోటల్లో పని చేస్తూ వికలాంగుడైన పెద్ద కుమారుడు హరీష్ను పోషిస్తున్నాడు. తల్లి వెల్లిపోయినప్పటి నుంచి హరీష్ అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆర్థిక స్థోమత లేని బాలరాజ్ కుమారునికి వైద్యం చేయించలేకపోయాడు. దీంతో ఇటీవల హరీష్(8) తీవ్ర అనారోగ్యానికి గురై చనిపోయాడు. అంత్యక్రియలు చేసేందుకు డబ్బులు లేక ఏం చేయాలో తెలియని పరిస్థితిలో బాలరాజ్ స్మశానంలో తన కొడుకు మృతదేహాన్ని ఒళ్లో పెట్టుకుని 8 గంటలపాటు ఏడుస్తూ కూర్చున్నాడు . బతికున్నప్పుడు తిండి పెట్టలేకపోయాను, చనిపోయాక అంత్యక్రియలు చేయలేకపోతున్నాను అంటూ కన్నీరు పెట్టుకున్నాడు. బాలరాజ్ పరిస్థితిని గమనించిన We Foundation కి చెందిన వారు అంత్యక్రియలు పూర్తి చేయడానికి సహకరించినట్లు సమాచారం.