నెల్లికుదురు, డిసెంబర్ 24: పంట చేను వద్ద ట్రాన్స్ఫార్మర్ ఫ్యూజ్ సరిచేస్తూ విద్యుదాఘాతంతో రైతు మృతి చెందాడు. ఈ ఘటన ఆదివారం మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలో చోటుచేసుకున్నది. నెల్లికుదురు మండంలోని శ్రీరామగిరి శివారు వెంకటాపురం గ్రామానికి చెందిన రైతు బుర్ర వేణు(40)కు మూడెకరాల భూమి ఉన్నది. అందులో పత్తి, మిరప పంటను సాగు చేస్తున్నాడు. ఆదివారం మిరప తోటకు నీళ్లు పెడుదామని వెళ్లాడు.
బోరు మోటరు ఆన్ చేసేందుకు స్విచ్ నొక్కినా పనిచేయలేదు. దీంతో ట్రాన్స్ఫార్మర్ వద్దకు వెళ్లి పరీక్షించాడు. ఫ్యూజ్ పోయిందోమోనని అనుమానంతో దాన్ని తీసి పెడుతుండగా విద్యుత్తు షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మహబూబాబాద్ ఏరియా దవాఖానకు తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతుడి భార్య సుజాత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్సై కే క్రాంతికిరణ్ తెలిపారు.