దేవరకద్ర, జనవరి 31 : అప్పుల బాధ తాళలేక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మహబూబ్నగర్ జిల్లాలో చోటుచేసుకున్నది. స్థానికుల కథనం మేరకు.. దేవరకద్ర మండలం గోపన్పల్లికి చెందిన వనం వెంకటేశ్ (35) తనకున్న ఎకరా పొలంతోపాటు మరో నాలుగెకరాలు కౌలుకు తీసుకొని పత్తి, వేరుశనగా సాగు చేశాడు. ఈ సారి పంట దిగుబడులు ఆశించిన స్థాయిలో రాకపోవడంతో.. పెట్టుబడులు, కుటుంబం పోషణ కోసం చేసిన అప్పులు పెరిగిపోవడంతో మనస్తాపం చెందాడు.
ఈ క్రమంలో ఉన్న ఎకరా పొలాన్ని విక్రయించి అప్పులు తీర్చాలని నిర్ణయించుకున్నాడు. పొలం అమ్మకూడదని అతని మామ నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. అప్పటికే మానసికంగా కుంగిపోయిన వెంకటేశ్ శనివారం ఉదయం పొలం వద్దకు వెళ్లిన అక్కడ ఉన్న పశువుల కొట్టంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మధ్యాహ్నం వరకు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పొలం వద్దకు వెళ్లి చూడగా విగతజీవిగా కనిపించాడు. పొలం అమ్మకూడదని మందలించినందుకే అల్లుడు ఆత్మహత్య చేసుకున్నాడంటూ అతని మామ మొగిలన్న ఆత్మహత్యకు యత్నించాడు. కాగా అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్టు తెలిసింది.