సుల్తాన్బజార్,జూన్ 14 : మెడికల్ బిల్లులను మంజూరు చేసేందుకు ఓ బాధితుడి నుంచి లంచం తీసుకొంటూ డీఎంఈ ఉద్యోగి ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ ఫయ్యాజ్ తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్లోని కోఠి డీఎంఈ మెడికల్ బిల్స్ ఇన్వార్డులో జూనియర్ అసిస్టెంట్గా జయకుమార్ విధులు నిర్వర్తిస్తున్నాడు. బాచుపల్లికి చెందిన కిషన్ తన తండ్రి మృతిచెందడంతో అతనికి చెందిన రూ.82,164 రీయింబర్స్మెంట్ నిమిత్తం మెడికల్ బిల్లుల మంజూరుకు డీఎంఈ మెడికల్ బిల్స్ ఇన్వార్డులో దరఖాస్తు చేసుకొన్నాడు.
మెడికల్ బిల్లులు మంజూరు కావాలంటే రూ.4వేలు ఇవ్వాలని జయకుమార్ డిమాండ్ చేశాడు. కిషన్ రూ.2500 ఇస్తానని ఒప్పందం చేసుకొన్నాడు. ఈ విషయమై ఈ ఏడాది మే 26న కిషన్ ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. మంగళవారం కిషన్ డీఎంఈ కార్యాలయంలో జయకుమార్కు డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకొన్నారు. ఈ మేరకు జయకుమార్పై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. తర్వాత పీర్జాదిగూడలో ఉన్న జయకుమార్ నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు.