శేరిలింగంపల్లి, మే 24: ఐపీఎస్ అధికారిగా, ఆర్మీ మేజర్గా, ఇంటెలిజెన్స్ అధికారిగా చెప్పుకుంటూ నేరాలకు పాల్పడుతున్న ఘరానా మోసగాడికి సైబరాబాద్ పోలీసులు అరదండాలు వేశారు. అతడి నుంచి ఢిల్లీ పోలీస్, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ పేరుతో ఉన్న నకిలీ ఐడీ కార్డులు, దేశవాళీ పిస్తోలు, 9 రౌండ్ల బుల్లెట్లు, పోలీసు, ఆర్మీ బ్యాడ్జ్లు, వాకీటాకీలు, దుస్తులు, రామరాజు పేరుతో ఉన్న బ్యాచ్, డిజిటల్ స్టాంప్ ప్యాడ్, బేడీలు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. నకిలీ ఐపీఎస్ అధికారికి సంబంధించిన సమాచారం అందుకున్న మాదాపూర్ పోలీసులు, శంషాబాద్ స్పెషల్ ఆపరేషన్ బృందం (ఎస్వోటీ) పోలీసులు నేరగాడిని అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు.
మాదాపూర్ డీసీపీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాదాపూర్ ఇంచార్జి, బాలానగర్ డీసీపీ టీ శ్రీనివాసరావు వివరాలను వెల్లడించారు. ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం అగ్రహారం గ్రామానికి చెందిన నాగరాజు కార్తీక్ రఘువర్మ అలియాస్ కార్తీక్ (25) భీమవరం జిల్లా వీరవాసరం మండలం చిక్కల గ్రామంలో స్థిరపడ్డాడు. డిగ్రీ వరకు చదువుకున్న కార్తీక్ ఉద్యోగ ప్రయత్నాల్లో భాగంగా 2016లో హైదరాబాద్ వచ్చాడు. 2017లో సనత్నగర్లోని గౌష్పాషా ట్రావెల్ ఏజెన్సీలో చేరాడు. నమ్మకంగా ఉంటూ ఆ తర్వాత ఓ వాహనంతో పరారయ్యాడు.ఈ కేసులో 6 నెలల జైలు శిక్ష అనుభవించిన నిందితుడు బెయిల్పై విడుదలై మహారాష్ట్రలో 4నెలల పాటు బోర్వెల్ ఆపరేటర్గా పనిచేశాడు. 2018లో హైదరాబాద్కు తిరిగి వచ్చి బంజారాహిల్స్లోని వరిష్టా ఇన్ఫోకామ్ సంస్థ యజమాని రాధకృష్ణ వద్ద డ్రైవర్గా పనిచేసి కారుతో ఉడాయించాడు.
ఆర్మీ అధికారి ముసుగులో బోగస్ శిక్షణ కేంద్రం
గచ్చిబౌలి అంజయ్యనగర్లోని ఎక్స్పర్ట్ సెక్యూరిటీ సంస్థలో సెక్యూరిటీ సూపర్వైజర్గా విధుల్లో చేరాడు. అక్కడ పనిచేస్తున్న ఆర్మీ మాజీ అధికారితో పరిచయం పెంచుకున్నాడు. ఈ క్రమంలో ఆర్మీ విభాగంలో అధికారుల హోదాలు, అందుకు తగిన బ్యాడ్జ్లు, దుస్తుల గురించి తెలుసుకున్నాడు. ఆ తర్వాత పరాస్ ఎఫ్ రెజిమెంట్కు చెందిన మేజర్ ర్యాంక్కు యూనిఫామ్ను కొనుగోలు చేసి సొంత గ్రామానికి చేరుకుని తాను పరాస్ ఎఫ్ రెజిమెంట్ మేజర్గా అందరినీ నమ్మించాడు. స్థానికంగా ‘సైనిక్ డిఫెన్స్ ట్రైనింగ్ సెంటర్’ పేరుతో బోగస్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించి నిరుద్యోగుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేసి మోసగించాడు.
ఇంటెలిజెన్స్ అధికారిగా
2020లో తిరిగి హైదరాబాద్ చేరుకున్న నిందితుడు ముగ్గురు అనుచరులతో కలిసి తాము ఇంటెలిజెన్స్ అధికారులమంటూ బెదిరించి బంజారాహిల్స్లోని మధుసుదన్రావు, ఇంటిలో సోదాలు నిర్వహించి లక్షలాది రూపాయలతో పరారయ్యాడు. ఆ తర్వాత శ్రీసాయి అంబులెన్స్ సర్వీసెస్ యజమాని శ్రీనివాస్ ముదిరాజ్, అతడి కుమారుడు కిడ్నాప్ చేసి రూ.50 వేలు గుంజుకున్నాడు. మదీనగూడలోని ‘ఐ హెల్త్ కేర్ హాస్పిటల్’ ప్రారంభోత్సవానికి ఆర్మీ కల్నల్ హోదాలో ముఖ్య అతిథిగా హాజరై యాజమాన్యం నుంచి రూ.1.30 లక్షలు వసూలు చేశాడు. అనుచరులు దీపక్కుమార్, పైల స్వామి సత్యనారాయణతో కలిసి కూకట్పల్లి ఫోరమ్ మాల్ నుంచి దిలీప్కుమార్ అనే వ్యక్తిని కిడ్నాప్ చేసి రూ.1.90 లక్షలు దోచుకున్నాడు.
కోడి రక్తంతో ఎన్కౌంటర్ డ్రామా….
2022లో స్వగ్రామం వెళ్లిన నిందితుడు ఏలూరు జిల్లాకు చెందిన మేకపాటి రవిశంకర్ ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను మోసం డబ్బులు వసూలు చేసిన విషయం తెలిసి తన అనుచరులతో కలిసి కిడ్నాప్ చేసి రూ. 2 లక్షలు వసూలు చేశాడు. రవిశంకర్ నుంచి డబ్బులు ఇప్పిస్తానని నమ్మించి మోసపోయిన నిరుద్యోగుల నుంచి రూ. 3.70 లక్షలు వసూలు చేశాడు. ఆ తర్వాత రవిశంకర్ను ఎన్కౌంటర్ చేసినట్టు డ్రామా ఆడి అతడిపై శరీరంపై కోడిరక్తం పూసి వీడియో తీయించాడు. ఈ క్రమంలో అతడి ఇంటిని తన పేర రాయించుకున్నాడు. జైలులో పరిచయమైన యశ్వంత్ అనే సైబర్ నేరగాడి సాయంతో జార్ఖండ్లో దేశీయ పిస్టల్ను, తొమ్మిది రౌండ్ల బుల్లెట్లను కొనుగోలు చేసి ఐపీఎస్ రామ్గా అవతారమెత్తాడు. జార్ఖండ్ మహిళకు తక్కువ ధరకే వాహనం ఇప్పిస్తానని నమ్మించి ఢిల్లీ తీసుకెళ్లి రూ. 9 లక్షలు తీసుకుని పరారయ్యాడు. ఓ కార్యాలయాన్ని ఏర్పాటుచేసుకొని ఐపీఎస్ అధికారినని మోసాలకు పాల్పడ్డాడు. తాజాగా ప్రసాద్ అనే వ్యక్తిని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించి పోలీసులకు చిక్కాడు.