హైదరాబాద్, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ నాయకుల అత్యుత్సాహం వారి మెడకే చుట్టుకొన్నది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఏకే గోయెల్ తన ఇంట్లో నగదు డంప్ చేశారని ఈసీకి తప్పుడు ఫిర్యాదు చేసి బొక్కొబొర్లాపడ్డారు. చివరికి ఎన్నికల అధికారుల తనిఖీల్లో ఏమీ దొరక్కపోవడంతో తలదించుకొన్నారు. దీనిపై శనివారం ఏకే గోయెల్ ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. తన నిజాయతీని శంకిస్తూ.. సోదాలు చేయించి, మీడియాలో, సోషల్ మీడియాలో లేనిపోని తప్పుడు వార్తలు సృష్టించి తన పరువు, ప్రతిష్టలకు భంగం కలిగించిన కాంగ్రెస్ నేతలపై పరువునష్టం దావా వేయనున్నట్టు గోయెల్ తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం పరిధిలో పనిచేస్తున్న ఫ్లయింగ్ స్కాడ్ బృందం శుక్రవారం సాయంత్రం 6 గంటలకు తన నివాసంలో మద్యం, నగదు నిల్వ చేశారనే వచ్చిన ఆరోపణలపై తనిఖీ చేయడానికి వచ్చిందని చెప్పారు. రాత్రి వరకూ ఇల్లంతా సోదా చేసి, సీసీ టీవీ ఫుటేజ్లు పరిశీలించిన తర్వాత నగదు, మద్యం ఏమీ లేకపోవడంతో తిరిగి వెళ్లిపోయారని వెల్లడించారు.
ఈ క్రమంలో ఈసీకి తప్పుడు ఫిర్యాదు ఇచ్చిన తెలంగాణ కాంగ్రెస్ నాయకులు గోయెల్ ఇంటిముందు నానా యాగీ చేశారు. దీనికి ఆజ్యం పోసేలా కాంగ్రెస్ మాజీ ఎంపీ మల్లు రవి, జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్, ఖైరతాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి విజయారెడ్డి వచ్చి తన ఇంటిముందు ఆందోళనకు దిగి, రెచ్చగొట్టే ప్రసంగాలు చేసి, తన పరువుకు భంగం కలిగించేలా ప్రవర్తించారని గోయెల్ చెప్పారు. తన ఇంట్లో దొరికింది ఏమీ లేకపోయినా.. వారి రెచ్చగొట్టిన వ్యాఖ్యలు వలనే గంటల తరబడి కాంగ్రెస్ కార్యకర్తలు తన ఇంటిముందు వికృతంగా ప్రవర్తించారని ఆవేదన వ్యక్తం చేశారు. అల్లరిమూకలను కట్టడి చేయడంలో సహకరించిన పోలీసులకు, భద్రతా బృందాలకు ఆయన కృతజ్ఞతలు చెప్పారు.