Viral News | కేసముద్రం, మార్చి 13 : ఆడ పిల్ల అంటే గుండెల మీద కుంపటి ఇది ఒకప్పటి మాట. పుట్టబోయేది అమ్మాయి అని తెలిస్తే అబార్షన్.. ఇది నిన్నటి నిజం. పుట్టిన పసికందును ఉయ్యాలలోనో, చెత్త కుప్పల్లోనో వదిలేసిన దృశ్యం..ఆడ శిశువుకు జన్మనిచ్చిన బాలింతకు సైతం విడాకులు ఇచ్చిన దుర్మార్గం..ఇదంతా గతం.ఇప్పుడు తెలంగాణలో సరికొత్త సంస్కృతి పరిఢవిల్లుతున్నది.ఆడ శిశువును గుండెలకు హత్తుకుంటున్నారు. ఆమెకు జన్మనిచ్చిన తల్లిని సైతం సాదరంగా స్వాగతిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా కే సముద్రం మండలం తాళ్లపూసపల్లి గ్రామంలో ఇలాంటి అద్భుత దృశ్యమే ఆవిష్కృతమైంది.
మూడు నెలల క్రితం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చి, సోమవారం అత్తారింట అడుగుపెట్టిన సంహితకు ఆమె అత్తమామలు శ్రీనివాసచారి, భద్రకాళి దంపతులు పూల బాట పరిచి మరీ ఘన స్వాగతం పలికారు. తెలంగాణ గడ్డ మీద ఈ మార్పు ఎలా సాధ్యమైంది?! ఒకే ఒక్క జవాబు సీఎం కేసీఆర్! ఆడబిడ్డల సంక్షేమం కోసం ఆయన ప్రవేశపెట్టిన పథకాలు!!
తొలుచూరు కాన్పులో ఆడబిడ్డ పుట్టడం అదృష్టంగా భావించింది ఆ కుటుంబం. ఇంటికి స్వయానా మహాలక్ష్మి వచ్చిందంటూ సంబురాలు జరుపుకొన్నది. రావమ్మా.. మహాలక్ష్మీ.. రావమ్మా అంటూ పూల వర్షం కురిపిస్తూ ఘన స్వాగతం పలికింది. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం తాళ్లపూసపల్లి గ్రామానికి చెందిన పొడకంటి సాయికిరణ్-సంహిత దంపతులకు మూడు నెలల క్రితం తొలి కాన్పులో ఆడపిల్ల జన్మించింది. సంహిత పుట్టిల్లు సిరిసిల్ల కాగా, మూడు నెలలు అక్కడే ఉన్నది. సోమవారం ఆమె తల్లి గారి ఇంటి నుంచి తన బిడ్డతో కలిసి తాళ్లపూసపల్లిలోని అత్తగారి ఇంటికి వచ్చింది. అత్త మామలు శ్రీనివాసచారి-భద్రకాళి దంపతులు మనవరాలు, కోడలికి పూలతో ఘనస్వాగతం పలికారు. ఇంటి బయట నుంచి లోపలి వరకు పూలతో అందంగా అలంకరించి ఆడబిడ్డపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. తొలిసారి పాప ఇంట్లో అడుగు పెడుతున్నందున కాలి ముద్రలను తీసుకున్నారు. శ్రీనివాసాచారి, భద్రకాళి దంపతులకు ఇద్దరూ కుమారులే. ఇప్పుడు మనువరాలు రావడంతో బిడ్డ లేని లోటు తీరిందని ఆనందం వ్యక్తం చేశారు.