హైదరాబాద్/హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ): పని ఒత్తిడి తట్టుకోలేక హెచ్ఎండీఏ ప్లానింగ్ విభాగంలో 15 ఏండ్లుగా కంప్యూటర్ ఆపరేటర్ (ఔట్ సోర్సింగ్)గా పనిచేస్తున్న శేఖర్ బుధవారం రాత్రి గుండెపోటుతో చనిపోయారు. ఏసీబీ అధికారులు శివబాలకృష్ణ కేసును విచారిస్తున్న క్రమంలో వివిధ రిపోర్టుల కోసం సెలవుల్లోనూ రాత్రి వరకు పనిచేస్తుండటంతో ఒత్తిడికి గురై గుండెపోటు వచ్చిందని భావిస్తున్నారు.
గురువారం మధ్యాహ్నం స్వర్ణజయంతి కాంప్లెక్స్లో హెచ్ఎండీఏ సిబ్బంది, ఉద్యోగులు సంతాప సమావేశం నిర్వహించి, అనంతరం అంత్యక్రియలు చేశారు. కాగా, శివ బాలకృష్ణను ఏసీబీ అధికారులు రెండో రోజూ కస్టడీకి తీసుకున్నారు. సుమారు 6 గంటల పాటు అక్రమాస్తులపై విచారించారు. ఇంట్లో దొరికిన డాక్యుమెంట్లపైనే ప్రధానంగా దృష్టిసారించినట్టు తెలిసింది. వీటితో పాటు 4 బ్యాంకు లాకర్లు, బినామీలు, పెట్టుబడులపై ఏసీబీ ప్రశ్నలు సంధించినట్టు సమాచారం.