హైదరాబాద్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ): అనాథలకు శాశ్వత అండగా నిలిచేందుకు ప్రభుత్వం బృహత్తర కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. వివిధ రాష్ర్టాల్లో తీసుకొంటున్న చర్యలు, అనాథలకు ఆశ్రయం కల్పిస్తూ వారి అభ్యున్నతికి చిత్తశుద్ధితో పాటుపడుతున్న స్వచ్ఛంద సంస్థల పనితీరును పరిశీలించాలని ఇటీవల సమీక్షించిన మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం రూపొందించిన నివేదికను సీఎం కేసీఆర్కు అందజేసింది. ఆ సిఫారులకు అదనంగా మరిన్ని శాశ్వత అంశాలు ఉండేలా సమగ్ర అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని సీఎం ఆదేశించారు.
దీంతో మంత్రి సత్యవతి రాథోడ్ నేతృత్వంలో స్త్రీ, శిశు సంక్షేమశాఖ కమిషనర్ భారతి హోళికేరి, సీఎం కార్యదర్శి స్మితా సబర్వాల్, హరితహారం ఓస్డీ ప్రియాంక వర్గీస్, మున్సిపల్ శాఖ డైరెక్టర్ పమేలా సత్పతితో కూడిన ఉన్నతాధికారుల బృందం శుక్రవారం విశాఖపట్నంలోని ఎస్వోఎస్ (ఎన్జీవో) నిర్వహిస్తున్న అనాథ ఆశ్రమాన్ని పరిశీలించనున్నది. అనంతరం బెంగళూర్, చెన్నై, రాజస్థాన్లలో పర్యటించి పది రోజుల్లోగా సీఎం కేసీఆర్కు నివేదిక అందజేయనున్నది.