హైదరాబాద్, జూలై 5(నమస్తే తెలంగాణ): వ్యవసాయశాఖలో క్షేత్రస్థాయి అధికారులు, ఉద్యోగుల మధ్య ప్రచ్ఛన్నయుద్ధం జరుగుతున్నది. డీఏవోలు, ఏడీఏలు, ఏవోలు వర్సెస్ ఏఈవోలుగా పరిస్థితి మారిపోయింది. ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలు, ఫిర్యాదులు చేసుకుంటున్నారు. రైతుల సంక్షేమం కోసం కలిసికట్టుగా పనిచేయాల్సిన వీరంతా పంతాలు, పట్టింపులకు పోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో, కమిషనరేట్లోని అధికారుల తీరే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తున్నది. క్షేత్రస్థాయిలో రైతులకు నేరుగా సేవలు అందించే వ్యవసాయ విస్తరణ అధికారులు(ఏఈవో)ల పట్ల వీరంతా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. భారమంతా ఏఈవోలపై మోపుతున్నారని, మంచి జరిగితే క్రెడిట్ కొట్టేస్తూ.. సమస్యలు వస్తే మాత్రం బలి చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఏఈవోలు, అధికారుల మధ్య సఖ్యత దెబ్బతిని సమస్యలు తలెత్తుతున్నట్టు తెలిసింది.
డీఏవోలు, ఏడీఏలు, ఏవోల తీరుపై ఏఈవోలు గుర్రుగా ఉన్నారు. ఆఫీసుల్లో కూర్చొని ఆదేశాలిచ్చి వదిలేస్తున్నారని, క్షేత్రస్థాయిలో వాటి అమలు సాధ్యాసాధ్యాలను ఏమాత్రం పట్టించుకోవడంలేదని వారు ఆరోపిస్తున్నారు. తమతో పాటు క్షేత్రస్థాయిలో ఉండాల్సిన అధికారులు ఎప్పుడూ ఆఫీసులకే పరిమితమవుతున్నారని, అంతటితో ఆగకుండా పెత్తనం చెలాయిస్తున్నారని మండిపడుతున్నారు. వారు చేయాల్సిన పనులు కూడా తమతోనే చేయిస్తారని, ప్రశ్నిస్తే సస్పెన్షన్లు, ట్రాన్స్ఫర్ల పేరుతో బెదిరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్ల వద్ద క్రెడిట్ కొట్టేసేందుకు ప్రయత్నం చేస్తూ తమను దోషులుగా చిత్రీకరిస్తున్నారంటూ రగిలిపోతున్నారు. కమిషనరేట్ నుంచి వచ్చే సమాచారాన్ని తమకు చేరవేయడం తప్ప అధికారులు ఇంకేమీ చేయరంటూ నిప్పులుచెరుగుతున్నారు.
తమకు అప్పగిస్తున్న పనులపై ఏఈవోలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తంచేస్తున్నారు. జాబ్చార్ట్కు సంబంధం లేని పనులన్నీ తమ అప్పగిస్తున్నారని, ఏ శాఖ పనైనా సరే ముందుగా ఏఈవోలే గుర్తుకొస్తున్నారని మండిపడుతున్నారు. రైతుభరోసా, కొత్త రైతుల ఎంట్రీ, రైతుబీమా, పంటల బుకింగ్, డిజిటల్ క్రాప్ సర్వే, వడ్లు, మక్కలు, పత్తి కొనుగోళ్లు, ఎరువుల పంపిణీ, రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహణ.. ఇలా ఎన్ని పనులను చేయగలమని ప్రశ్నిస్తున్నారు. ఇదేందని అడిగితే చేస్తారా? చస్తారా? అన్నట్టు బెదిరిస్తున్నారని మదనపడుతున్నారు. అదీగాక ప్రతినిత్యం రైతుల మధ్యే ఉండే తమను ప్రభుత్వ పథకాల ఆలస్యంతో వారు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతున్నామని వాపోతున్నారు. ధాన్యం కొనుగోళ్లు, యూరియా పంపిణీలో ఇబ్బందులు వస్తే రైతులు తమనే దోషులుగా చూస్తున్నారని, కానీ ఉన్నతాధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా ఏఈవోలపై పనిభారం తగ్గించి, జాబ్చార్ట్ ప్రకారం పనులు అప్పగించాలని కోరుతున్నారు.