హైదరాబాద్, జూలై 11 (నమస్తే తెలంగాణ): షరా మామూలే.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి మౌనదీక్ష పేరుతో సోమవారం కొంగజపం చేశారు. ధరణి పోర్టల్పై అక్కసు వెళ్లగక్కారు. ఇక్కడే తన అవగాహనా రాహిత్యాన్ని బయటపెట్టుకొన్నారు. వాస్తవానికి భూ రికార్డుల డిజిటలైజేషన్ ప్రక్రియను కేంద్ర ప్రభుత్వమే ప్రోత్సహిస్తున్నది. రాష్ర్టాలన్నీ అమలుచేయాలని ఒత్తిడి తెస్తున్నది. ప్రోత్సాహకాలు ఇస్తున్నది. ఇవేమీ తెలియని బండి సంజయ్ అడ్డగోలు వ్యాఖ్యలతో అభాసుపాలయ్యారు.
మొదలు పెట్టింది మోదీయే
దేశంలోని భూముల వివరాలన్నీ డిజిటలైజ్ చేయాలని కేంద్రం 2016లో నిర్ణయించింది. ‘డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ మాడ్రనైజేషన్ ప్రోగ్రామ్'(డీఐఎల్ఆర్ఎంపీ) పేరుతో కార్యక్రమాన్ని ప్రారంభించింది. రాష్ర్టాల్లో అమలుకు నిధులు ఇస్తామని ప్రకటించింది. ధరణి తెచ్చినందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న బండి సంజయ్ ఇప్పుడు కేంద్రాన్ని, మోదీని తిట్టగలరా? అని తెలంగాణవాదులు నిలదీస్తున్నారు. సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజల భూములను గుంజుకోవడానికే ధరణి తెచ్చారంటూ బండి వ్యాఖ్యానించారు. ఈ లెక్కన 2016లో డిజిటలైజేషన్ ప్రారంభించిన మోదీ ఇప్పటివరకు ఎంత భూమిని గుంజుకున్నాడో బండి చెప్పాలని తెలంగాణవాదులు డిమాండ్ చేస్తున్నారు. యూపీ సహా అనేక బీజేపీ పాలిత రాష్ర్టాల్లో డిజిటలైజేషన్ అమలవుతున్నదని, మరి ఆయా రాష్ర్టాల సీఎంలు, మంత్రులు ఎన్ని వేల ఎకరాలు మాయం చేశారో బయటపెట్టాని కోరుతున్నారు. భూములన్నింటినీ సీఎం కేసీఆర్ తీసుకుంటున్నారంటూ బండి చేసిన వ్యాఖ్యలపైనా తెలంగాణవాదులు మండిపడుతున్నారు. ధరణి పోర్టల్లో ఏ భూమి ఎవరి పేరుమీద ఉన్నా స్పష్టంగా కనిపిస్తున్నదని, లావాదేవీలు పూర్తయిన క్షణాల్లోనే సమాచారం అప్డేట్ అవుతున్నదని చెప్తున్నారు. బండి అడ్డగోలు మాటలు ఆపి, రుజువుగా రికార్డులను చూపించాలని డిమాండ్ చేస్తున్నారు.
15వ ఆర్థిక సంఘం ప్రశంసలు
భూ రికార్డుల నిర్వహణ, సంస్కరణల్లో తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని 15వ ఆర్థిక సంఘం కొనియాడింది. రికార్డుల డిజిటలైజేషన్లో దేశంలోనే రెండో స్థానంలో నిలిచిందని గతంలో ప్రశంసించింది. కంప్యూటరైజ్డ్ డాటాతో లబ్ధిదారులను సులభంగా గుర్తిస్తూ.. రైతులకు ఉపయోగపడే పలు పథకాలను సమర్థంగా అమలుచేస్తున్నదని కొనియాడింది. రాష్ట్రంలోని 99 శాతానికిపైగా భూముల సమాచారాన్ని తెలంగాణ ప్రభుత్వం డిజిటలైజ్ చేసిందని పేర్కొన్నది. తద్వారా దేశంలోనే మహారాష్ట్ర తర్వాత రెండో స్థానంలో నిలిచిందని ప్రశంసించింది. రికార్డుల డిజిటలైజేషన్తో తెలంగాణలో రైతుల కోసం అమలుచేస్తున్న రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలు నేరుగా లబ్ధిదారులకు అందుతున్నాయని ఆర్థికసంఘం అభినందించింది. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని భూముల వివరాలన్నింటినీ ప్రజలకు అందుబాటులో ఉంచిందని, దీంతో మోసాలకు ఆస్కారం లేకుండా పోయిందని ధరణి పోర్టల్ను అభినందించింది.