Lasya Nanditha | సంగారెడ్డి : కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత కారు డ్రైవర్ ఆకాశ్పై కేసు నమోదు చేసినట్లు సంగారెడ్డి జిల్లా పోలీసులు తెలిపారు. కారు ప్రమాదం ఘటనపై లాస్య నందిత సోదరి నివేదిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. డ్రైవర్ ఆకాశ్పై 304ఏ సెక్షన్ కింద పటాన్చెరు పోలీసు స్టేషన్లో కేసు నమోదైందన్నారు. డ్రైవర్ నిర్లక్ష్యంగా కారు నడిపాడని లాస్య సోదరి నివేదిత తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అతి వేగంగా కారు నడిపి లాస్య మృతికి కారణమయ్యాడని ఆమె అన్నారు.
ఈ ప్రమాద ఘటనపై సంగారెడ్డి జిల్లా అడిషనల్ ఎస్పీ సంజీవరావు మీడియాకు వివరాలు వెల్లడించిన సంగతి తెలిసిందే. ప్రమాదం జరిగిన సమయంలో కారులో లాస్య నందితతో పాటు ఆమె డ్రైవర్ ఆకాశ్(24) ఉన్నాడు. సదాశివపేటలోని దర్గాకు వెళ్లేందుకు ఎమ్మెల్యే లాస్య నందిత తన ఇంటి నుంచి శుక్రవారం తెల్లవారుజామున బయల్దేరారు. తెల్లవారుజామున 4:58 గంటల సమయంలో శామీర్పేట టోల్ ప్లాజా వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపైకి ప్రవేశించారు. సుల్తాన్పూర్ ఎగ్జిట్ సమీపంలో ఉదయం 5:30 గంటల సమయంలో ముందు వెళ్తున్న వాహనాన్ని ఎమ్మెల్యే కారు ఢీకొట్టింది. దీంతో కారు అదుపుతప్పి రెయిలింగ్ను ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో లాస్య నందిత బతికే ఉన్నారు. ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయారు. పీఏ ఆకాశ్ ఎడమకాలు విరిగిపోయింది. అతను శ్రీకర ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని ఏఎస్పీ సంజీవ రావు తెలిపారు. ఇది రోడ్డు ప్రమాదమే అని పోలీసులు తేల్చారు.