ఇందల్వాయి, మార్చి 13: నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారి-44పై చంద్రయాన్పల్లి గ్రామం వద్ద ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు యువకులు దుర్మరణం చెందారు. సీఐ మోహన్ తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని కొండల్వాడికి చెందిన నీరడి గణేశ్(28), అతని సోదరుడు నీరడి ఆదిత్య(25), అదే గ్రామానికి చెందిన మరో స్నేహితుడు ప్రకాశ్(28) కొంతకాలంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నివాసం ఉంటూ మొబైల్ షాప్ నడుపుతున్నారు. దుకాణంలోకి సామగ్రి తీసుకొచ్చేందుకు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని దుబ్బ ప్రాంతానికి చెందిన సాయిరాం(27)తో కలిసి నలుగురు ఆదివారం కామారెడ్డి వైపు కారులో వెళ్లారు. పని ముగించుకొని తిరిగి వస్తుండగా చంద్రయాన్పల్లి వద్ద 44వ జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న కంటైనర్ను వీరి కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. వారి కారు నుజ్జునుజ్జయ్యింది. సమాచారం అందుకున్న సీఐ మోహన్, ఏసీపీ కిరణ్కుమార్ సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదానికి కారణమైన వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కంటైనర్ డ్రైవర్పై చర్యలు తీసుకోవాలని మృతుడు గణేశ్ తండ్రి నీరడి హన్మాండ్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై గణేశ్ తెలిపారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.