హైదరాబాద్ : ఎన్నికల్లో ఎలాగైనా గెలువాలని బీజేపీ పార్టీ ఓటర్లను(voters ) ప్రలోభాలకు గురి చేస్తున్నది. విచ్చలవిడిగా డబ్బు, మద్యం పంపిణీ చేసి ఓట్లను కొనాలని చూస్తున్నది. అందులో భాగంగా జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని చింతల్( Chintal)లో డబ్బులు పంచుతున్న వ్యక్తిని(BJP leader )బాలానగర్ ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అఖిల్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి లక్ష రుపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. అఖిల్ ఒక్కో కవర్లో రూ.5000 నగదు చొప్పున పెట్టి ఓటర్లకు పంచుతుండగా అరెస్ట్ చేశారు.
నిందితుడు అఖిల్ స్థానికంగా ఉన్న సమ్మక్క-సారక్క క్రషర్ మిషన్ కంపెనీలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. అయితే అఖిల్ కుత్బుల్లాపూర్ బీజేపీ అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్కు ముఖ్య అనుచరుడు కావడం గమనార్హం. ఓటుకు 5వేల నగదు ఇచ్చి ప్రలోభాలకు గురిచేస్తున్నారని బీజేపీపై స్థానికులు మండిపడుతున్నారు. బీజేపీ అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ అనుచరుడు అఖిల్ను అరెస్ట్ చేసి, కవర్లో పంచడానికి సిద్ధంగా ఉన్న నగదును సీజ్ చేసి జీడిమెట్ల పోలీసులకు ఎస్ఓటీ పోలీసులు అప్పగించారు. కేసు నమోదు చేసిన జీడిమెట్ల పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.