గొల్లపల్లి: ఆ యువకుడి వయస్సు 17 ఏళ్లు..! ఇటీవలే ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం పూర్తిచేశాడు..! డిగ్రీ లేదా బీటెక్లో చేరేందుకు ఇంకా సమయం ఉండటంతో ఇంట్లోనే ఉంటూ వరికోత మిషన్ నడిపే తండ్రికి చేదోడువాదోడుగా సహకరిస్తున్నాడు..! అదే ఆ యువకుడు చేసిన పాపమయ్యింది..! అతని పాలిట శాపమయ్యింది..! వరికోత మిషన్లో ఇరుక్కున్న మట్టిని తొలగిస్తుండగా తండ్రి పొరపాటున బ్లేడ్ను రన్ చేయడంతో ఆ యువకుడు మిషన్లో పడి నలిగిపోయాడు..! కన్నతండ్రి కళ్లముందే విలవిల్లాడుతూ ప్రాణాలు విడిచాడు..! జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం అబ్బాపూర్ గ్రామంలో ఇవాళ (ఆదివారం) ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది..!
వివరాల్లోకి వెళ్తే.. అబ్బాపూర్ గ్రామానికి చెందిన చెవుల ప్రభాకర్, విజయం దంపతులకు కొడుకు చెవుల రంజిత్ (17) తోపాటు ఒక కుమార్తె ఉన్నారు. ప్రభాకర్ గ్రామంలో డిష్ ఆపరేటర్గా పనిచేయడంతోపాటు ఓ హార్వెస్టర్ మిషన్ను కొనుగోలు చేసి వరికోతలకు కూడా వెళ్తున్నాడు. ఇటీవల అతని కొడుకు రంజిత్ ఇంటర్ పూర్తిచేశాడు. ఉన్నత తరగతుల్లో చేరేందుకు సమయం ఉండటంతో ఇంటిపట్టునే ఉంటూ తండ్రికి అన్ని పనుల్లో సహకరిస్తున్నాడు. ఈ క్రమంలోనే శనివారం తండ్రితో కలిసి తమ సొంత పొలంలో వరికోసేందుకు వెళ్లాడు.
తండ్రి మిషన్తో వరికోస్తుంటే రంజిత్ ఆ మిషన్లో ఇరుక్కున్న మట్టిని, చెత్తను తొలగిస్తూ సహకరిస్తున్నాడు. ఆ రోజు చీకటిపడే వరకు వరి కోసినా పూర్తి కాకపోవడంతో ఇంటికి వెళ్లి ఆదివారం ఉదయాన్నే మళ్లీ పొలానికి చేరుకున్నారు. ప్రభావకర్ మిగిలిన వరిని కోస్తూ మిషన్లో ఇరుక్కున్న మట్టిని తొలగించమని కొడుకు రంజిత్కు ఎప్పటిలాగే పని పురమాయించాడు. అయితే రంజిత్ మట్టిని తొలగిస్తుండగానే ప్రభాకర్ పొరపాటున బ్లేడ్ను రన్ చేశాడు. అంతే క్షణాల్లో రంజిత్ మిషన్లో పడి నడుము వరకు ఇరుక్కుపోయాడు.
కన్నతండ్రి చేసిన పొరపాటుకు ఆయన కళ్లముందే చెట్టంత కొడుకు ఒళ్లంతా రక్తమోడుతూ విలవిల్లాడాడు. తల పగిలిపోయి కొంత మెదడు బయటపడింది. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న రంజిత్ను గ్రామస్తుల సాయంతో చికిత్స కోసం కరీంనగర్కు తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రాణాలు కోల్పోయాడు. చెట్టంత కొడుకును చేజేతులా చంపుకున్నామంటూ ఆ తల్లిదండ్రులు విలపిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది.