Heart Attack | కోనరావుపేట, డిసెంబర్ 25: గుండెపోటు వచ్చి 13 ఏండ్ల బాలుడు మృతిచెందిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిజామాబాద్లో సోమవారం జరిగింది. నిరుపేద కుటుంబానికి చెందిన తాళ్లపల్లి శంకర్-సరిత దంపతులకు ఇద్దరు కుమారులు జశ్వంత్, సుశాంత్(13) ఉన్నారు. దంపతులిద్దరూ కూలి పనిచేస్తూ ఇద్దరు కొడుకులను ప్రభుత్వ పాఠశాలల్లో చదివిస్తున్నారు. జశ్వంత్ కోనరావుపేట ప్రభుత్వ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతుండగా, సుశాంత్ ముస్తాబాద్ మండలంలోని గురుకుల పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు.
ఈ క్రమంలో క్రిస్మస్ పండుగ కోసం సుశాంత్ ఆదివారం హాస్టల్ నుంచి ఇంటికి వచ్చాడు. సోమవారం ఇంట్లో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నాడు. మధ్యాహ్నం ఛాతీలో నొప్పి వస్తున్నదని చెప్పడంతో కుటుంబ సభ్యులు సిరిసిల్ల జిల్లా దవాఖనకు తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స చేస్తుండగానే సుశాంత్ మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు. దీంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. క్రిస్మస్ సంబురాలతో సంతోషం నిండాల్సిన వారి ఇంట్లో ఒక్కసారిగా విషాదం నెలకొన్నది. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని సర్పంచ్ కేతిరెడ్డి అరుణ కోరారు.