హైదరాబాద్, జూలై 19 (నమస్తే తెలంగాణ): జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవాన్ని (డీ వార్మింగ్ డే) గురువారం భారీ ఎత్తున నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఏడాది నుంచి 19 ఏండ్ల మధ్య వయసున్న వారికి ప్రత్యేకంగా 400 మిల్లీగ్రాములు ఉండే ఆల్బెండజోల్ ట్యాబ్లెట్లను పంపిణీ చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 41,337 మంది టీచర్లకు, 35,700 మంది అంగన్వాడీలకు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చింది. 1-19 ఏండ్ల మధ్య వయసున్న బాలలు మొత్తంగా 98.97 లక్షల మంది ఉంటారని వైద్యారోగ్యశాఖ అంచనా వేసింది. వీరందరికీ ట్యాబ్లెట్లు పంపిణీ చేయాలని లక్ష్యంగా నిర్ణయించింది. ఏదేని కారణం వల్ల ట్యాబ్లెట్లు తీసుకోలేని విద్యార్థుల కోసం ఈ నెల 27న మరోసారి డీవార్మింగ్ కార్యక్రమం నిర్వహిస్తారు. నిరుడు 96.47 లక్షల మందికి ట్యాబ్లెట్లు పంపిణీ చేయగా, ఈ సారి సుమారు 2.5 లక్షల మంది పెరిగారు. అంగన్వాడీలు సహా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో డీ వార్మింగ్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. స్కూల్ బయట ఉన్న పిల్లలకు ఆశ కార్యకర్తలు, అంగన్వాడీల సాయంతో ట్యాబ్లెట్లు పంపిణీ చేస్తారు.