CSE | హైదరాబాద్, జూలై 16 (నమస్తే తెలంగాణ): ఇంజినీరింగ్ కోర్సుల్లో కంప్యూటర్ సైన్స్ కోర్స్ హవా కొనసాగుతున్నది. గతంలో మాదిరిగా ఈ ఏడాది కూడా ఈ కోర్సుకు తీవ్ర డిమాండ్ నెలకొన్నది. ఎంసెట్ ఇంజినీరింగ్ మొదటి విడుత కన్వీనర్ కోటా సీట్లను సాంకేతిక విద్యాశాఖ అధికారులు ఆదివారం కేటాయించారు. ఈ కౌన్సెలింగ్లో సీఎస్ఈ కోర్సుల సీట్లు హాట్ కేకుల్లా మారాయి. మొత్తం సీట్లల్లో 98.70 శాతం సీట్లు నిండాయి. ఈ ఒక్క కోర్సులో 23,467 సీట్లుంటే మొదటి విడుతలోనే 23,162 సీట్లు భర్తీ అయ్యాయి.
ఇంకా 305 సీట్లు మాత్రమే మిగిలాయి. మొదటి విడుత కౌన్సెలింగ్కు హాజరైన వారిలో 85.48 శాతం మంది విద్యార్థులు సీట్లు పొందారు. మొత్తం 173 కాలేజీల్లో కన్వీనర్ కోటాలో 82,666 ఇంజినీరింగ్ సీట్లు ఉండగా, 70,665 సీట్లు భర్తీ అయ్యాయి. ఇంకా మిగిలి ఉన్న 12,001 సీట్లను రెండో విడుత కౌన్సెలింగ్లో భర్తీ చేస్తారు. మూడు యూనివర్సిటీలు, 28 ప్రైవేట్ కాలేజీలు కలుపుకొని 31 కాలేజీల్లో 100 శాతం సీట్లు నిండాయి. యూనివర్సిటీల్లో 85.12 శాతం, ప్రైవేట్ వర్సిటీల్లో 75.08 శాతం, ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల్లో 85.71 శాతం సీట్లు నిండాయి. కౌన్సిలింగ్కు హాజరైన 76,821 మందిలో 70,665 మంది విద్యార్థులు సీట్లను దక్కించుకొన్నారు. మరో 5,043 మంది వెబ్ ఆప్షన్లు ఎంచుకున్న కాలేజీల్లో సీట్లు లేక దక్కించుకోలేకపోయారు. ఏడాది ఈడబ్ల్యూఎస్ కోటాలో 5,576 మంది సీట్లను దక్కించుకొన్నారు.
వివిధ కోర్సుల్లో సీట్ల భర్తీ వివరాలు
22లోగా ఫీజు చెల్లింపు గడువు
ఇంజినీరింగ్ సీట్లు పొందిన విద్యార్థులు వెబ్సైట్ నుంచి అలాట్మెంట్ ఆర్డర్ను డౌన్ లోడ్ చేసుకోవాలి. దానిలో పేరొన్న ఫీజును ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించాలి. ఆ తర్వాత సీటు కన్ఫర్మేషన్ అవుతుంది. ఈ నెల 22లోపు ట్యూషన్ ఫీజు చెల్లించి, సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ ముగిశాక సంబంధిత కాలేజీల్లో విద్యార్థులు ఆగస్టు 9 నుంచి 11లోగా రిపోర్టు చేయాల్సి ఉంటుంది.