హైదరాబాద్, మే 5 (నమస్తే తెలంగాణ): ఇంటి పన్ను చెల్లించటంలో గ్రామ పంచాయతీల్లోని ఇంటి యజమానులు సరికొత్త రికార్డును సృష్టించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 8 జిల్లాల్లో వందకు వంద శాతం పన్ను చెల్లించి గ్రామాల అభివృద్ధికి తమ వంతు సహకారం అందించారు. మరో 5 జిల్లాల్లో 99 శాతం పన్నులు చెల్లించారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో 12,769 గ్రామ పంచాయతీల్లో రూ.314.03 కోట్లు ఇంటిపన్ను వసూలు లక్ష్యంగా నిర్ణయించారు. ఇందులో రూ.302.98 కోట్లు వసూలైంది. రాష్ట్రం మొత్తమ్మీద 96.48 శాతం ఇంటిపన్ను వసూలైనట్టు లెక్కలు తేలాయి. మరో రూ.11.05 కోట్లు పన్ను వసూలు కావాల్సి ఉన్నది. కొత్తగూడెం, జనగామ, కామారెడ్డి, మెదక్, నారాయణ్పేట్, నిర్మల్, సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల్లో వందకు వంద శాతం పన్ను చెల్లించారు. సంగారెడ్డి, గద్వాల, వనపర్తి, కరీంనగర్, మహబూబాబాద్ జిల్లాల్లో 99 శాతం పన్ను వసూలైంది. రాష్ట్రంలో అత్యధిక మొత్తం ఇంటిపన్ను చెల్లిస్తున్న జిల్లాగా సంగారెడ్డి ముందున్నది. పల్లె ప్రగతి ద్వారా గ్రామాల్లో చేపడుతున్న అభివృద్ధిపనులు, మౌలిక సదుపాయాలు కల్పించడంతో గ్రామస్థులు ఇంటిపన్ను చెల్లించడానికి ముందుకొస్తున్నారు. ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలకు తాము కూడా సహకరించాలనే ఉద్దేశంతో ఇంటి పన్నును సకాలంలో చెల్లిస్తున్నారు.